తెలంగాణ

telangana

ETV Bharat / bharat

25 లక్షల దీపాలతో అయోధ్య దీపోత్సవం - 2 గిన్నిస్ రికార్డులు బ్రేక్​ - AYODHYA DEEPOTSAV 2024

అయోధ్యలో కన్నుల పండువగా దీపోత్సవం - 25 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు బ్రేక్!

Ayodhya Deepotsav 2024
Ayodhya Deepotsav 2024 (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 6:23 PM IST

Updated : Oct 30, 2024, 8:41 PM IST

Ayodhya Deepotsav 2024 : బాలరాముడు కొలువుదీరిన ఆయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గత ఎనిమిదేళ్లుగా సరయూ నదీ తీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం, ఈసారి కూడా అత్యంత వైభవంగా వేడుకలు జరిపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వయంగా దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు 25 లక్షలకుపైగా దీపాలు వెలిగించారు. దీనితో అయోధ్యా నగరం ధగధగా మెరిసిపోయింది. 55 ఘాట్‌లలో ఏర్పాటు చేసిన ఈ ప్రమిదలను ప్రత్యేక డ్రోన్లతో గిన్నిస్‌ ప్రతినిధులు లెక్కించారు.

గిన్నిస్ రికార్డ్​
అయోధ్య దిపోత్సవంలో భాగంగా, యూపీ టూరిజం డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో భక్తులు​ ఏకకాలంలో 25,12,585 దీపాలను వెలిగించారు. ఇది ఇంతకు ముందు ఉన్న అన్ని గిన్నిస్​ రికార్డ్​లను బ్రేక్ చేసింది. అదే విధంగా యూపీ టూరిజం డిపార్ట్​మెంట్​, సరయు హారతి సమితి ఆధ్వర్యంలో ఏకకాలంలో 1,121 మంది దేవునికి హారతి ఇస్తూ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఈ విధంగా ఆయోధ్య దీపోత్సవం ఏక కాలంలో రెండు గిన్నిస్ రికార్డులను సృష్టించింది.

అలరించిన లేజర్ షో
అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి దీపావళి కావడం వల్ల దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయోధ్య దీపోత్సవానికి ముందు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారులు కొలువుదీరిన రథాన్ని లాగారు. వేడుకల సందర్భంగా సుమారు 10వేల మంది భద్రతా సిబ్బంది అయోధ్య రక్షణ బాధ్యతలు నిర్వహించారు.

వేడుకల సందర్భంగా ప్రదర్శించిన లేజర్‌, డ్రోన్‌ షోలు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లేజర్‌ షో ద్వారా రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. మయన్మార్‌, నేపాల్‌, థాయ్‌లాండ్‌, మలేషియా, కంబోడియా, ఇండోనేసియా, భారతీయ కళా ప్రదర్శనలు సైతం ఆకట్టుకున్నాయి.

దీపోత్సవం స్పెషల్​

  • 25 లక్షల దీపాలను వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిర్వాహకులు, దాదాపు 28 లక్షల ప్రమిదలను ముందస్తుగానే ఆర్డర్‌ చేశారు.
  • రామమందిరంతోపాటు పరిసర ప్రాంతాలను దీపాలతో అలంకరించారు.
  • దీపోత్సవ కార్యక్రమంలో 30,000 వాలంటీర్లు పాల్గొన్నారు
  • ఓ ఘాట్‌ వద్ద 80,000 దీపాలతో స్వస్తిక్‌ ఆకారంలో దీపాలను వెలిగించారు.
  • పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఆవు నెయ్యితో లక్షన్నర దీపాలను వెలిగించారు.
  • ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రత్యేక పూజలు చేసి, హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • మయన్మార్‌, నేపాల్‌, థాయిలాండ్‌, మలేసియా, కంబోడియా, ఇండోనేసియాకు చెందిన కళాకారులతో వేదిక వద్ద ప్రదర్శన నిర్వహించారు.
  • ఘాట్‌ల వద్ద దాదాపు ఐదారు వేల మంది అతిథుల కోసం ఏర్పాట్లు చేశారు.
  • లైవ్‌ కవరేజీ కోసం పెద్ద తెరలు ఏర్పాటు చేశారు
  • నగరం మొత్తం దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
Last Updated : Oct 30, 2024, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details