Union Budget 2025 Estimates :పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివద్ధే లక్ష్యంగా కేంద్రం 2025-26 బడ్జెట్ను పార్లమెంటు ముందు ఉంచింది. వికసిత్ భారత్ దిశగా సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో తొలిసారి వేతన జీవులకు 12 లక్షల వరకూ ఆదాయ పన్ను మినహాయింపులు కల్పించింది. మొత్తం రూ.50,65,345 కోట్లతో నూతన బడ్జెట్ను ప్రతిపాదించింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది 8వ సారి. తద్వారా ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు. 'ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన అభివృద్ధి చర్యలు పది విస్తృత రంగాల్లో ఉన్నాయి. పేదలు, యువత, అన్నదాత, మహిళలపై దృష్టిపెట్టినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 'వ్యవసాయ అభివృద్ధి, దిగుబడి పెంపు, గ్రామాల్లో నిర్మాణాత్మక అభివృద్ధి, సమగ్రాభివృద్ధి పథంలోకి అందరినీ కలుపుకుని వెళ్లడం, మేకిన్ ఇండియాలో భాగంగా ఉత్పత్తి పెంపు, ఎమ్ఎస్ఎమ్ఇలకు మద్దతు, ఉద్యోగాలు కల్పించే అభివృద్ధి, ప్రజా ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులు, ఇంధన సరఫరా పరిరక్షణ, ఎగుమతులకు ప్రోత్సాహం, ఆవిష్కరణలు పెంచి పోషించడం ఇందులో భాగం. ఈ అభివృద్ధి యాత్రలో వ్యవసాయం, ఎమ్ఎస్ఎమ్ఈ, పెట్టుబడులు, ఎగుమతులు మన శక్తివంతమైన ఇంజన్లు' అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
2025-26 బడ్జెట్ ఆదాయం(కోట్లు) :
మొత్తం ఆదాయం | 50,65,345 |
రెవెన్యూ ఆదాయం | 34,20,409 |
మూలధన ఆదాయం | 16,44,936 |
రుణ వసూళ్లు | 29,000 |
ఇతర ఆదాయం | 47,000 |
అప్పులు,ఇతర రుణాలు | 15,68,936 |
2025-26 బడ్జెట్ వ్యయం( కోట్లు)
మొత్తం వ్యయం | 50,65,345 |
రెవెన్యూ వ్యయం | 39,44,255 |
వడ్డీ చెల్లింపులు | 12,76,338 |
గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ | 4,27,192 |
మూలధన వ్యయం | 11,21,090 |
రెవెన్యూలోటు | 5,23,846 |
ద్రవ్యలోటు | 15,68,936 |