తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్ర గేయంలో 'ద్రవిడ' పదం మిస్సింగ్​! సీఎం స్టాలిన్ ఫైర్​- గవర్నర్​ను రీకాల్ చేయాలని డిమాండ్

మరోసారి తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం- దుమారం రేపిన గాయకుల తప్పు!

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

CM Stalin On Tamil Nadu Governor
CM Stalin On Tamil Nadu Governor (ANI)

CM Stalin On Tamil Nadu Governor : తమిళనాడులో మరోసారి ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం రాజుకొంది. గవర్నర్ ఆర్​ఎన్ రవి అధ్యక్షతన చెన్నైలోని దూరదర్శన్‌ హిందీ మాస వేడుకలో తమిళనాడు రాష్ట్ర గేయాన్ని ఆలపిస్తూ అందులో ద్రవిడ అనే పదం ఉన్న వాక్యాన్ని గాయకులు దాట వేశారు. ఇది రాజకీయంగా దుమారం రేపి ముఖ్యమంత్రి స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ ​రవి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

దేశ ఐక్యతను, తమిళనాడును అక్కడి ప్రజలను గవర్నర్ అవమానించారని సీఎం స్టాలిన్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే ద్రవిడ అనే పదం పలకకుండా దాటవేశారని ఆరోపణ చేశారు. జాతి ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. తన ఇష్టానుసారంగా నడుచుకునే వ్యక్తి ఆ పదవిలో ఉండేందుకు తగరని ఆర్​ఎన్​ రవి గవర్నరా లేక ఆర్యుడా అని ప్రశ్నించారు. ఒకవేళ జాతీయ గీతంలో ద్రవిడ అనే పదం వస్తే ఇలానే వదిలేస్తారా? అని ప్రశ్నించారు. తమిళనాడు రాష్ట్ర గేయంలో ద్రవిడ పదం దాటవేతను AIDMK చీఫ్ పళనిస్వామి ఖండించారు. అది పెద్ద తప్పు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సహా పలు పార్టీలు కూడా తీవ్రంగా ఖండించాయి.

'గవర్నర్​ తప్పేం లేదు'
మరోవైపు స్టాలిన్ మాట్లాడిన తీరు విచారకరమని గవర్నర్ ఆర్​ఎన్​రవి అన్నారు. సీఎం తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారన్న గవర్నర్, తమిళనాడు రాష్ట్ర గేయాన్ని అవమాన పరిచినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఓ ముఖ్యమంత్రి ఆ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్‌ తప్పేమీ లేదని పేర్కొంది ఆయన కార్యాలయం. కార్యక్రమంలో గేయాన్ని ఆలపించిన బృందం పొరపాటుగా పేర్కొంది. సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు చెప్పింది. ఈ వివాదం నేపథ్యంలో చెన్నై దూరదర్శన్‌ కేంద్రం స్పందించింది. అనుకోకుండా తప్పు జరిగిందని క్షమాపణలు చెప్పింది. తమిళనాడు రాష్ట్ర గేయాన్ని అగౌరపరిచే ఉద్దేశం గాయకులకు లేదని పేర్కొంది.

హిందీ మాసం వేడుకలు నిర్వహించొద్దు!
అంతకుముందు, హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ మాసం వేడుకలను భవిష్యత్తులో నిర్వహించొద్దని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. చెన్నై దూరదర్శన్‌ కేంద్రం స్వర్ణోత్సవాల సంబరాలతో కలిపి హిందీ మాసం వేడుకలను శుక్రవారం గవర్నర్‌ అధ్యక్షతన నిర్వహించారని తెలిపారు. భారత రాజ్యాంగం ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. చట్టాలు చేయడం, న్యాయశాఖ, సమాచార సంబంధాలు వంటి అధికారిక ఉద్దేశాల కోసం మాత్రమే హిందీ, ఆంగ్ల భాషలను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ మాసం వేడుకలు నిర్వహించడం ఇతర భాషలను తక్కువచేసే ప్రయత్నంగానే తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటివి కొనసాగించాలని అనుకుంటే, ప్రాంతీయ భాషలకూ మాస వేడుకలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details