తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి - కానీ మోదీ ఉండగా అది జరగదు : రాహుల్ గాంధీ - RAHUL GANDHI ADANI ISSUE

అదానీని వెంటనే అరెస్ట్ చేయాలన్న లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

Rahul Gandhi Adani Issue
Rahul Gandhi Adani Issue (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 2:13 PM IST

Rahul Gandhi Adani Issue :అధికారులకు మిలియన్ డాలర్ల కొద్దీ లంచం ఇవ్వడం, మోసానికి పాల్పడినట్లు అమెరికాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సెబీ చీఫ్​పై విచారణ జరిపించాలని అన్నారు. ఈ మేరకు గురువారం దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు రాహుల్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

'అదానీ అరెస్ట్ కారు'
అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని రాహుల్‌ గాంధీ అన్నారు. 'శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ప్రధాని మోదీ వందశాతం అదానీని రక్షిస్తున్నారు. అదానీ అవినీతి చేసి దేశ ఆస్తులు సొంతం చేసుకున్నారు. అదానీ బీజేపీకి పూర్తిగా మద్దతు ఇస్తారనే విషయం నిరూపితమైన అంశం. గౌతమ్‌ అదానీని అరెస్టు చేయాలని మేము కోరుతున్నాం. కానీ అదానీ అరెస్టు అవ్వరు. ఎందుకంటే భారత దేశ ప్రధాని మోదీ అదానీ వెనుక ఉన్నారు. ఆయన్ని రక్షిస్తున్నారు. ఎవరు నేరం చేసినా వారిని జైలులో పెడతానని నరేంద్ర మోదీ అంటారు. అదానీ నేరం చేశారని అమెరికా ఏజెన్సీ చెబుతోంది. భారత్‌లో అదానీ నేరం చేసినట్లు అమెరికా చెబుతోంది. లంచాలు ఇచ్చినట్లు, విద్యుత్‌ను ఎక్కువ ధరకు అమ్మినట్లు చెబుతోంది. కానీ ఇక్కడ ప్రధాన మంత్రి ఏమీ చేయడం లేదు. ఏమీ చేయలేరు కూడా. ఎందుకంటే ప్రధాని మోదీ గౌతమ్‌ అదానీ నియంత్రణలో ఉన్నారు' అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

'రాహుల్​ గాంధీకి అలవాటే'
రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర స్పందించారు. దేశంపై, దానని రక్షించే వారిపై దాడి చేయడం రాహుల్‌ గాంధీకి అలవాటేనని అదానీ అన్నారు. ప్రధాని మోదీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తారన్నారు. "అదానీ గ్రూపుపై అమెరికా ఆరోపణలకు సంబంధించి, స్పష్టత ఇవ్వడం, స్వీయరక్షణ చేసుకోవడం ఆ కంపెనీకి సంబంధించిన విషయం. అదానీ గ్రూపు లంచం ఇచ్చిందని ఆరోపణలున్న రాష్ట్రాల్లో ఒక్క బీజేపీ ముఖ్యమంత్రి కూడా లేరు. 2019లో కూడా ఇదే తరహాలో రాఫెల్ విషయంలో చేశారు. కొవిడ్ వ్యాక్సిన్​పై ఇదే పద్ధతిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కానీ ఆ తర్వాత సుప్రీం కోర్టు ముందు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది" అని సంబిత్‌ పాత్రా పేర్కొన్నారు.

'సీబీఐ దర్యాప్తు జరిపించాలి'
మరోవైపుల అదానీపై వచ్చిన ఆరోపణలపై ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వ అధికారులకు ఇంత పెద్ద ఎత్తున లంచం ఇవ్వడాన్ని భారత్​ కాకుండా అమెరికా బహిర్గతం చేయడం సిగ్గుచేటని పేర్కొంది. అమెరికా చెప్పిన అంశాల ఆధారంగా కేసు నమోదు చేయడానికి సీబీఐ ఆదేశించాలని తెలిపింది. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకుని, సమగ్ర దర్యాప్తు ఆదేశిస్తుందని భావిస్తున్నట్లుగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు.

ABOUT THE AUTHOR

...view details