Puri Jagannath Rathyatra 2024 :విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని నలు మూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు అక్కడి వీధులన్నీ 'జై జగన్నాథ' నినాదాలతో మార్మోగాయి. ఆదివారం సాయంత్రం జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర వారి రథాలు నందిఘోష, తాళధ్వజం, పధ్వధ్వజం రథాలపై తల్లి చెంతకు పయనమయ్యారు.
ఆదివారం తెల్లవారు జామున రత్న సింహాసనంపై చతుర్థామూర్తులు కొలువుదీరారు. అనంతరం జగన్నాథుడి నవయవ్వన రూపాలంకరణ చేశారు. మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాలవల్లభ సేవలు తర్వాత నేత్రోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం పూరీ రాజు గజపతి దివ్యసింగ్దేవ్ రథాలపై చెరాపహరా ( బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చడం) చేశారు. అనంతరం ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేశారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెట్టారు. అవి అందుకోవడానికి కోసం భక్తులు పోటీ పడ్డారు.
ఆ తర్వాత ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథంపై ప్రతిష్ఠించారు. భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా దాదాపు ఐదడుగుల ఏడు అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తుల జయధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకు వచ్చి నందిఘోష రథం మీద ఉంచారు. ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను 'పహాండీ' అంటారు.
కస్తూరి కళ్లాపి
ఊరేగింపునకు సిద్ధంగా ఉన్న స్వామిపై పూరీ సంస్థానాధీశులు గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు. అలాగే బలరాముడిని, సుభద్రాదేవిని కూడా అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగించారు. జగన్నాథుని రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాల మేరకు కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి 'జై జగన్నాథా' అని బిగ్గరగా అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెట్టారు.