Prem Kanwar Shaktawat Woman Forest Officer :పురుషుల కంటే తాము ఏ రంగంలోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు మహిళలు. ఎన్ని కష్టాలనైనా ఓర్చి ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. అయితే మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళ అటవీ శాఖలో సత్తా చాటుతున్నారు. సుమారు 400 జీవాలను కాపాడి విధుల్లో శివంగిలా దూసుకెళ్తున్నారు. మరెందుకు ఆలస్యం అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గురించి తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాకు చెందిన ప్రేమ్ కంవర్ శక్తావత్ 2011లో ఫారెస్ట్ గార్డుగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆమె భైన్రోద్గర్ వన్యప్రాణుల అభయారణ్యంలో విధులు నిర్వర్తించారు. ఈ తర్వాత అభేద బయోలాజికల్ పార్కులో ఉద్యోగం చేశారు. 2020లో పదోన్నతి పొంది ప్రస్తుతం ఆమె రాజస్థాన్ కోటాలోని ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్లోని కోలిపురా ప్రాంతంలో అసిస్టెంట్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. దట్టమైన, ప్రమాదకరమైన ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పనిచేయడమంటే కత్తిమీద సామే అని చెప్పాలి. అయినా ఆమె ఏనాడు ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ 13 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ప్రేమ్ కంవర్ పాంథర్, మొసలి, జింకలు, లేడులను కాపాడారు. 400 కంటే ఎక్కువ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించారు. అలాగే విషపూరితమైన, ప్రమాదకరమైన పాములు, 15 అడుగల పొడవున్న మొసళ్లు, కొండచిలువలను రక్షించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో జంతు సంరక్షణకు సంబంధించి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు.
వన్దుర్గా అవార్డు సొంతం
ప్రేమ్ కంవర్ శక్తావత్ భైన్రోద్గర్ అభయారణ్యంలో పనిచేసినప్పుడు పక్షులు, అటవీ జంతువుల పాదముద్రలపై ఒక నివేదిక తయారుచేశారు. ఈ క్రమంలో ఆమెకు వైల్డ్ వరల్డ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) నుంచి వైల్డ్లైఫ్ ఫ్రెండ్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు ఆమెకు రూ.2 లక్షలు ప్రోత్సాహకం కూడా WWF ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ, పర్యవేక్షణకు సంబంధించి ఏషియన్ రేంజర్ ఫోరమ్ గువహాటిలో నిర్వహించిన కార్యక్రమంలో 'వన్దుర్గా' అవార్డును సైతం సొంతం చేసుకున్నారు ప్రేమ్ కంవర్ శక్తావత్. ఆమెకు ఈ అవార్డును మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ అందించారు.