తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్టీ నేతను గుర్తుచేసుకుని మోదీ ఎమోషనల్- DMK, కాంగ్రెస్​పై నిప్పులు చెరిగిన ప్రధాని! - PM Modi Gets Emotional In Tamilnadu

PM Modi Gets Emotional In Tamilnadu : లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు పర్యటించిన ప్రధాని మోదీ, సేలంలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ నాయకుడి సేవలను గుర్తుచేసుకుని ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ప్రతిపక్ష ఇండియా కూటమి హిందూ మతాన్ని టార్గెట్‌ చేసిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పదేపదే హిందూ మతాన్ని అవమానించే కాంగ్రెస్‌, డీఎంకేలు ఇతర మతాల జోలికి మాత్రం వెళ్లబోవన్నారు. భారీ అవినీతి, ఒకే కుటుంబపాలనకు ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండుముఖాల వంటివన్నారు.

PM Modi Gets Emotional In Tamilnadu
PM Modi Gets Emotional In Tamilnadu

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 7:31 PM IST

PM Modi Gets Emotional In Tamilnadu :లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తమిళనాడులో పర్యటించారు. సేలం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ పార్టీ నేత, ఆడిటర్‌ వి.రమేశ్‌ హత్యకు గురైన విషయాన్ని గుర్తుచేసిన కొంత భావోద్వేగానికి గురయ్యారు. కాసేపు తన ప్రసంగాన్ని నిలిపేశారు. ఆ తర్వాత "ఆడిటర్‌ రమేశ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం ఆయన మనతో లేరు. ఆయనో గొప్ప వక్త. రాత్రింబవళ్లు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. కానీ, ఆయన హత్యకు గురయ్యారు. సభాముఖంగా నేను ఆయనకు నివాళి అర్పిస్తున్నా" అని ప్రధాని మోదీ తెలిపారు.

అనంతరం కాంగ్రెస్​, తమిళనాడు అధికార డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల ముంబయిలో జరిగిన ర్యాలీలో శక్తిపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీ సేలం సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌, డీఎంకేలను లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడిచేశారు. కాంగ్రెస్‌, డీఎంకేలు హిందూ మతాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని, కానీ అవే నాశనం అవుతాయని అందుకు పురాణాలు, ఇతిహాసాలే సాక్ష్యమన్నారు. వచ్చేనెల 19న తమిళనాడు ప్రజలు మొదట అదే పని చేయబోనున్నారని ప్రధాని మోదీ చెప్పారు. తమిళనాట 39లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగే తేదీని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇండియా కూటమి హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. హిందూమతాన్ని నాశనం చేయాలనే ప్రకటనల ద్వారా కాంగ్రెస్‌, డీఎంకేలు తమ దురుద్దేశాన్ని చాటుకున్నాయన్నారు. పదేపదే హిందూమతాన్ని అవమానించే ఆ రెండుపార్టీలు ఇతరమతాల జోలికి మాత్రం వెళ్లబోవన్నారు. జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి మదర్‌ ఇండియాను శక్తిగా ఆరాధించారని మోదీ గుర్తుచేశారు. శక్తిని నాశనం చేస్తామన్న వారిని తమిళనాడు ప్రజలు శిక్షిస్తారని, తాను శక్తి ఆరాధకుడినని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్‌, డీఎంకేలు ఒక నాణేనికి రెండు ముఖాల వంటివన్నారు.

"డీఎంకే, కాంగ్రెస్‌లు ఒక నాణేనికి రెండు ముఖాల వంటివి. డీఎంకే, కాంగ్రెస్‌ అంటే భారీ అవినీతి, ఒకే కుటుంబ పాలన. అందువల్ల దేశంలో కాంగ్రెస్‌ అధికారానికి దూరం అయిందన్నారు. దేశం నేడు 5జీ సాంకేతికత దశకు చేరింది. అయితే తమిళనాడులో డీఎంకేది ప్రత్యేక 5జీ నడుస్తోంది. డీఎంకే 5జీ అంటే ఒకే కుటుంబానికి చెందిన ఐదోతరం తమిళనాడును కబ్జా చేసింది. 5జీ కుటుంబం 2జీ కుంభకోణానికి పాల్పడి ప్రపంచవ్యాప్తంగా భారత్‌, తమిళనాడు ప్రతిష్ఠను దిగజార్చింది."
--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

తమిళనాడు అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అందువల్లే తమిళనాడులో బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు. తమిళనాడు మాజీ సీఎం కామరాజ్‌ నిజాయితీ, మధ్యాహ్న భోజన పథకం విప్లవాత్మక పథకాలు తనకు అతిపెద్ద ప్రేరణ అని ప్రధాని మోదీ తెలిపారు.

"ఎన్డీయే ప్రభుత్వం దేశంలో రెండు డిఫెన్స్‌ కారిడార్లను ఏర్పాటు చేస్తోంది. అందులో ఒకటి తమిళనాడులో ఏర్పాటు కానుంది. బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లను ఏర్పాటు చేయనుంది. అందులో ఒకటి తమిళనాడులో తయారుకానుంది. మా ప్రభుత్వం స్పెషాలిటీ స్టీల్‌ తయారీకి సంబంధించిన పథకం కోసం రూ.6వేల కోట్లు మంజూరు చేసింది. దీనివల్ల ఇక్కడి స్టీల్‌ పరిశ్రమకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ఇక్కడ రైల్వే మౌలిక సదుపాయల కోసం రూ.500కోట్లు ఖర్చు చేశాం. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా నడుస్తోంది."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

అంతకుముందు కేరళలోని పాలక్కాడ్‌లో ప్రధాని మోదీ అట్టహాసంగా రోడ్‌షో నిర్వహించారు. ఉదయం కోయంబత్తూర్‌ నుంచి పాలక్కాడ్‌ చేరుకున్న ప్రధానికి బీజేపీ శ్రేణులు, స్థానికులు అపూర్వస్వాగతం పలికారు. పూలతో అందంగా అలంకరించిన ఓపెన్‌ టాప్‌ జీపుపై కాషాయరంగు నెహ్రూ టోపీ ధరించి ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారు. కిలోమీటరు పొడవునా సాగిన రోడ్‌షో సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా బారులుతీరిన బీజేపీ శ్రేణులు, స్థానికులు ప్రధాని మోదీపై పూలవర్షం కురిపించారు.

'మూడు వారాల్లోగా సమాధానం చెప్పండి'- CAAపై కేంద్రానికి సుప్రీం డెడ్​లైన్!

NDAకు షాక్- కేంద్రమంత్రి పశుపతి పరాస్​ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details