Iron Pole On Railway Track :ఉత్తర్ప్రదేశ్ రాంపుర్లో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇటీవల కాళింది ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ను ఢీకొట్టగా, తాజాగా అదే తరహా ఘటన త్రుటి తప్పింది. బుధవారం రాత్రి నైనీ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ (12091) రైలు వెళ్తుండగా పట్టాలపై టెలిఫోన్ స్తంభం పడి ఉన్నట్లు లోకోపైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన, ఎమర్జెన్సీ బ్రేకులు వేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇది విధ్వంసకర చర్య అని పేర్కొన్నారు.
ఇదీ జరిగింది
బుధవారం రాత్రి 10.18 గంటల సమయంలో బిలాస్పుర్ రోడ్ - రుద్రపుర్ సిటీ మధ్యలో పట్టాలపై దాదాపు ఆరు మీటర్ల పొడవు గల ఇనుప స్తంభాన్ని లోకోపైలట్ గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు ఆపారు. తర్వాత రుద్రాపుర్లోని స్టేషన్ మాస్టర్కు ఈ సమాచారం అందించారు. ట్రాక్ క్లియర్ చేసిన తర్వాత రైలును సురక్షితంగా తీసుకెళ్లినట్లు రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు.
అయితే రైళ్ల కార్యకలాపాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో సంఘ విద్రోహక శక్తులు రైల్వే ట్రాక్లపై బండరాళ్లు పెట్టడం, పట్టాలను విరగొట్టడం, గ్యాస్ సిలిండర్లు వంటి విధ్వంసక చర్యలతో అడ్డంకులు సృష్టిస్తున్నారని పలు రైల్వే డివిజన్లు నివేదించాయని తెలిపారు. ఆయా విభాగాల ఫిర్యాదులతో ఎఫ్ఐఆర్ (FIR) లు నమోదయ్యాయని తెలిపారు. సంఘ వ్యతిరేక శక్తులను గుర్తించి కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు.