తెలంగాణ

telangana

గగన్​యాన్ మిషన్- అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు వీరే

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 12:36 PM IST

Updated : Feb 27, 2024, 1:26 PM IST

Gaganyaan Astronauts : గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వీరు నలుగురు వ్యక్తులు కాదని, భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి మోసుకెళ్లే శక్తులు అని మోదీ పేర్కొన్నారు.

gaganyaan astronauts
gaganyaan astronauts

Gaganyaan Astronauts :గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్​తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. వీళ్లతో మోదీ ముచ్చటించారు. ఈ వ్యోమగాములను 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే నాలుగు శక్తులుగా అభివర్ణించారు మోదీ. కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్​లో గగన్​యాన్ ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు మోదీ. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్​ మోదీని సత్కరించారు.

వారి భాగస్వామ్యం లేనిదే!
21వ శతాబ్దంలో భారత్ ప్రపంచస్థాయి దేశంగా అవతరిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పురోగమిస్తోందని తెలిపారు. చంద్రయాన్, గగన్​యాన్ వంటి ప్రాజెక్టుల్లో మహిళల పాత్ర ఎనలేనిదని మోదీ కొనియాడారు. వారి భాగస్వామ్యం లేనిదే ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యేవి కాదని అన్నారు. గగన్​యాన్ మిషన్​లో చాలా వరకు భారత్​లో తయారైన పరికరాలను ఉపయోగించడం గర్వకారణమని చెప్పారు.

"దేశాభివృద్ధి ప్రయాణంలో కొన్ని ఘట్టాలు భవిష్యత్​ను నిర్దేశించేవిగా ఉంటాయి. ఇది అలాంటి క్షణమే. గగన్​యాన్ మిషన్​కు ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఇప్పుడు దేశానికి పరిచయం అయ్యారు. వీరు నలుగురు వ్యక్తులు మాత్రమే కాదు, 140 కోట్ల మంది ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు స్పేస్​లో అడుగుపెట్టనున్నారు. కానీ ఈసారి వ్యోమగాములను పంపించే రాకెట్ మనం సొంతంగా తయారు చేసుకున్నది. టైమ్, కౌంట్​డౌన్ అన్నీ మనవే."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

గగన్ యాన్ ప్రయోగంలో పాల్గొనేందుకు ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్, అజిత్ కృష్ణన్, అంగడ్‌ ప్రతాప్, శుభాన్షు శుక్లాకు శిక్షణ కొనసాగుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్తారు. ఒకటి నుంచి మూడు రోజులపాటు వారిని అక్కడే ఉంచి తిరిగి భూమి మీదకు తీసుకొస్తారు. కక్ష్యలోకి వెళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చే క్రమంలో సముద్ర జలాల్లో ల్యాండ్ చేస్తారు.

Last Updated : Feb 27, 2024, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details