తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 6:47 PM IST

Updated : Mar 4, 2024, 7:02 PM IST

ETV Bharat / bharat

మహిళలకు నెలకు ఫ్రీగా రూ.1500- ఆ రాష్ట్రంలో రూ.వెయ్యి- వచ్చే నెల నుంచే అమలు!

Financial Help For Women : మహిళలకు ప్రతినెలా రూ.1500 భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది హిమాచల్​ ప్రదేశ్​ ప్రభుత్వం. ఇదే తరహా పథకాన్ని దిల్లీ సర్కార్​ కూడా అమలు చేస్తామని వెల్లడించింది. అయితే ఇక్కడ మహిళలకు నెలకు రూ.1000 ఇస్తామని ప్రకటించింది.

Financial Help For Women
Financial Help For Women

Financial Help For Women :రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా హిమాచల్​ ప్రదేశ్​ సర్కార్​ అక్కడి మహిళలకు తీపికబురు వినిపించింది. ప్రతినెలా మహిళలకు రూ.1,500 భృతి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్​ సుఖు వెల్లడించారు. మరోవైపు ఇదే తరహా పథకాన్ని తాము కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు దిల్లీలోని ఆమ్​ ఆద్మీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్​లో ప్రతిపాదనలు చేసింది.

హిమాచల్​లో నెలకు రూ.1,500
హిమాచల్​లోని కాంగ్రెస్​ సర్కార్​ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అక్కడి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పథకం కింద ప్రతినెలా రూ.1,500 భృతి పొందే మహిళలు కచ్చితంగా 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వీరికి మాత్రమే ఈ స్కీం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్​ సుఖు స్పష్టం చేశారు. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) నుంచి దీనిని అమలు చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

సుఖు 10 గ్యారెంటీలు
అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ హిమాచల్​లో 10 గ్యారెంటీలను ప్రకటించింది. అందులోని ఒక గ్యారెంటీనే మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఆర్థిక సాయం పంపిణీ పథకం. 'ఇందిరా గాంధీ ప్యారీ బెహన్​ సుఖ్​ సమ్మాన్ నిధి యోజన' పేరిట దీనిని అమలు చేయనుంది సుఖు ప్రభుత్వం. ఈ పథకం కింద దాదాపు 5లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. అయితే ఈ హామీ అమలు కోసం ఏడాదికి రూ.800 కోట్ల ఆర్థిక భారం సర్కార్​పై పడనుందని తెలిపారు సీఎం. ఇక ఈ గ్యారెంటీ అమలుతో 10లో ఐదింటిని నెరవేర్చినట్లవుతుందని ఆయన చెప్పారు.

దిల్లీలో నెలకు రూ.1,000- వీరికి మాత్రమే
మరోవైపు రూ.76 వేల కోట్లతో సోమవారం రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టింది కేజ్రీవాల్​ ప్రభుత్వం. 2024-25 ఏడాదికి సంబంధించిన బడ్జెట్​ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు దిల్లీ ఆర్థిక శాఖ మంత్రి అతిశీ. ఈ బడ్జెట్​ కేటాయింపుల్లో దిల్లీ మహిళలకు ప్రతినెలా రూ.1,000 చొప్పున భృతి ఇస్తామని ప్రకటించారు మంత్రి. అయితే ఇందుకు అర్హులుగా 18 ఏళ్లు నిండిన మహిళలను ఎంపిక చేయనున్నారు. 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్​ యోజన' పేరిట అమలు చేయనుంది ఆప్​ సర్కార్​. ఈ పథకంతో 45 నుంచి 50 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని చెప్పారు ఆర్థిక మంత్రి. కాగా, ఈ నిర్ణయాన్ని మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద ముందడుగుగా అభివర్ణించారు సీఎం కేజ్రీవాల్​.

రామేశ్వరం పేలుడు కేసు NIA చేతికి- నిందితుడి రూట్​మ్యాప్​పై పోలీసుల నజర్

'ప్రశ్నకు నోటు' కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు ఉండదు'- సుప్రీం కీలక తీర్పు

Last Updated : Mar 4, 2024, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details