తెలంగాణ

telangana

'ఆస్పత్రిపై బీజేపీ, సీపీఎం దాడి చేశాయ్​'- దీదీ సర్కార్​ వైఫల్యమన్న హైకోర్ట్- 24 గంటలపాటు ఓపీ బంద్​ - Kolkata Doctor Case

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 7:05 PM IST

Kolkata Doctor Case : కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆస్పత్రిపై సీపీఎం, బీజేపీ దాడి చేసినట్లు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. వాస్తవాలు బయటకు రాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. నేరానికి పాల్పడినవారిని ఉరి తీయాలన్న దీదీ, ఆదివారంలోపు ఈ కేసును తేల్చాలని సీబీఐని కోరారు. మరోవైపు ఆస్పత్రిపై దాడి రాష్ట్ర యంత్రాంగం వైఫల్యంగా కలకత్తా హైకోర్టు పేర్కొనగా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.

Kolkata Doctor Case
Kolkata Doctor Case (ETV Bharat)

Kolkata Doctor Case :కోల్‌కతా ఆస్పత్రిలో జరిగిన హత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ కేసును బంగాల్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని, తృణమూల్‌ కాంగ్రెస్‌ సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళనకారులు ఆరోపిస్తున్న తరుణంలో సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ పాదయాత్ర నిర్వహించారు. హత్యాచారానికి గురైన జూనియర్‌ డాక్టర్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సాక్ష్యాలు లేకుండా చేసేందుకే ఆర్​జీ కర్‌ ఆస్పత్రిపై ప్రతిపక్ష సీపీఎం, బీజేపీ దాడి చేశాయని మమత ఆరోపించారు.

ఉరి తీయాలని దీదీ డిమాండ్​
జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనలో వాస్తవాలను మరుగుపర్చేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లు మమత విమర్శించారు. ఇలాంటి చర్యలను ఖండిస్తున్నట్లు దీదీ తెలిపారు. నేరానికి పాల్పడినవారిని ఉరి తీయాలన్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తును ఆమె ప్రశంసించారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఆదివారం నాటికి దోషులెవరో తేల్చాలని మమతా బెనర్జీ కోరారు. మరోవైపు, ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ శుక్రవారం బంగాల్ అంతటా ర్యాలీలు, ధర్నాలు చేపట్టింది.

ఆస్పత్రిపై దాడి- హైకోర్టు ఏమందంటే?
బుధవారం అర్ధరాత్రి కోల్‌కతా ఆస్పత్రిపై జరిగిన దాడి ఘటనపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే కారణమని ఆక్షేపించింది. ఏడు వేలమంది గుమిగూడితే అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల మధ్య వైద్యులు విధులు ఎలా నిర్వహిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

24 గంటలు ఓపీ బంద్​
కోల్‌కతా ఆస్పత్రిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు మరో పది మందిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 19కి పెరిగింది. డిజిటల్ బ్లూప్రింట్‌ను రికార్డ్ చేయడానికి 3D లేజర్ స్కానర్‌ను తీసుకుని శుక్రవారం మధ్యాహ్నం ఆర్​జీ కర్​ ఆస్పత్రికి వెళ్లారు సీబీఐ అధికారులు. హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 వరకు ఓపీ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

దాడి జరిగితే ఆరు గంటల్లోపు కేసు పెట్టండి!
ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో కొందరు దుండగులు సృష్టించిన విధ్వంసాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. ఆస్పత్రి ప్రాంగణం లేక సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగిన ఆరు గంటల్లోపు పోలీసులు కేసు పెట్టాలని చెప్పింది. నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే సంబంధిత ఆస్పత్రి హెడ్ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కోల్​కతా ఆస్పత్రిపై దాడితో మళ్లీ కలకలం- పోలీసుల దర్యాప్తు ముమ్మరం- వారికోసం అభయ హోం - Kolkata Hospital Incident

'రీక్లెయిమ్​ ది నైట్'- అర్ధరాత్రి అట్టుడుకిన బంగాల్​- వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆస్పత్రిలో విధ్వంసం! - Kolkata Doctor Case

ABOUT THE AUTHOR

...view details