తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బల పరీక్షకు ముందు నీతీశ్​కు షాక్​- 10 మంది ఎమ్మెల్యేలు దూరం! లాలూ మాస్టర్ స్ట్రోక్? - Bihar Floor Test 2024

Bihar Floor Test 2024 : బలపరీక్ష నేపథ్యంలో బిహార్​ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తమ సామర్థ్యం చాటుకోవడం కోసం జేడీయూ ఏర్పాటు చేసిన విందుకు ఆ పార్టీకి చెందిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. అయితే అందులో కొంతమందికి ఆర్​జేడీ నుంచి ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా బలపరీక్షలో నీతీశ్​ను ఓడించేందుకు ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సర్వ శక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, తమ పార్టీలో ఏ సమస్య లేదని, తామంతా ఐక్యంగా ఉన్నామని జేడీయూ చెబుతోంది.

Bihar Floor Test 2024
Bihar Floor Test 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 6:52 PM IST

Bihar Floor Test 2024 :బలపరీక్ష నేపథ్యంలో బిహార్​లో రాజకీయాలు ప్రతి గంటకూ మారుతున్నాయి. బలపరీక్షలో నెగ్గి ఎన్​డీఏతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించాలని నీతీశ్​ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పట్టుదలతో ఉంది. ఇక విశ్వాస పరీక్షలో నీతీశ్​ను ఓడించి, తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆర్​జేడీ, కాంగ్రెస్ మహా కూటమి తన వ్యూహాలకు పదునుపెడుతోంది. బలపరీక్షలో నీతీశ్ ఓడిపోయేలా ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీ నేత ఇచ్చిన విందుకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మంత్రి శ్రవణ్​ కుమార్​ విప్​ జారీ చేసి మరీ జేడీయూ ఎమ్మెల్యేలను విందుకు ఆహ్వానించారు. కానీ ఆ విందుకు దాదాపు 10 మంది జేడీయూ నేతలు గైర్హాజరైనట్లు సమాచారం. ఇందులో బీమా భారతి, అనిరుధ్ యాదవ్, అశోక్ కుమార్ చౌదరి, దిలీప్ రాయ్, అమన్ హజారీ, గుంజేశ్వర్ షా, డాక్టర్ సంజీవ్, సుదర్శన్, షాలినీ మిశ్ర, గోపాల్ మండల్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే వీరికి ఆర్​జేడీ వల వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే విషయాన్ని జేడీయూ ఎమ్మెల్యే గోపాల్​ మండల్​ 'ఈటీవీ భారత్​'కు ప్రత్యేకంగా తెలిపారు. తేజస్వీ యాదవ్ తనకు ఫోన్​ చేసి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆఫర్​ ఇచ్చారని గోపాల్ మండల్ తెలిపారు. కానీ తాను వారి ప్రతిపాదనను తిరస్కరించానని వెల్లడించారు. లోక్​సభ ఎన్నికల్లో జేడీయూ టికెట్​పైనే పోటీ చేస్తానని, తనకు మంత్రి పదవిపై కూడా ఆసక్తి లేదని చెప్పారు. ఇక తాను విందుకు హాజరు కాలేకపోవడంపై మండల్​ క్లారిటీ ఇచ్చారు. ట్రాఫిక్​లో ఇరుక్కు పోయినందునే విందుకు రావడానికి ఆలస్యం అయిందని స్పష్టం చేశారు. అలాగే అనివార్య కారణాల వల్ల బీమా భారతి కూడా చేరుకోలేక పోయారని, ఆమె శనివారం సాయంత్రం పట్నా చేరుకుంటారని తెలిపారు. ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అనారోగ్యం కారణాల వల్ల విందుకు హాజరు కాలేకపోయారని గోపాల్ మండల్ వెల్లడించారు.

'మేమంతా ఐక్యంగా ఉన్నాం'
పార్టీ విందుకు కొంతమంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అవడంపై జేడీయూ నేతలు స్పందించారు. తామంతా ఐక్యంగా ఉన్నామని ఎమ్మెల్యే మనోజ్ యాదవ్ ప్రకటించారు. నీతీశ్​ కుమార్​కు అండగా నిలుస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ మెజారిటీని నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇక తమ పార్టీలో ఎలాంటి సమస్యలు లేవని మాజీ మంత్రి సంజయ్ ఝా అన్నారు.

''నీతీశ్ కుమార్ నాయకత్వంలో మేము బలంగా ఉన్నాం. మా ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ సాధిస్తుంది. ఎన్​డీఏ ఎమ్మెల్యేలు పూర్తిగా ఏకమయ్యారు.''
-- జమా ఖాన్, మాజీ మంత్రి

'అందరూ ఎన్​డీఏకు ఓటేయండి'
ఫిబ్రవరి 12న జరిగే విశ్వాస పరీక్షలో ఎన్​డీఏకు అనుకూలంగా ఓటు వేయాలని హిందుస్థానీ ఆవమ్ మోర్చా (హెచ్​ఏఎమ్) ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినట్లు బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ వ్యవస్థాపకుడు జీతన్ రామ్ మాంఝీ తెలిపారు. సీపీఐ (ఎమ్​ఎల్) నేత మెహబూబ్ ఆలం తనను కలిసిన కొద్దిసేపటికే మాంఝీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 'మా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు నీతీశ్​ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారు. అయితే మీడియాలో నెలకొన్న అయోమయం పోగొట్టడం కోసం అవసరం లేకున్నా విప్ జారీ చేశాం' అని మాంఝీ తెలిపారు. ఇక ఆలం తనను కలవడంపై స్పందించిన మాంఝీ, తాను అసెంబ్లీలో సీనియర్ సభ్యుడినని, అందువల్ల తోటి ఎమ్మెల్యేలు సామాజిక, రాజకీయ సమస్యలపై చర్చించడానికి వస్తుంటారని క్లారిటీ ఇచ్చారు.

బిహార్ అసెంబ్లీ స్పీకర్​పై అవిశ్వాస తీర్మానం! సీఎం తొలి కేబినెట్ మీటింగ్

జేడీయూ చేరిక NDAకు లాభమేనా? 40 సీట్లు క్లీన్​స్వీప్​ చేస్తారా?

ABOUT THE AUTHOR

...view details