Published : Dec 16, 2023, 12:34 PM IST
గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉంది - మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు : కేటీఆర్
KTR reacts on Governor Speech in Assembly : గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని అసెంబ్లీలో కేటీఆర్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంపై సత్య దూరమైన మాటలు కనిపించాయని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల పక్షాన ఉంటామని, ప్రజల తరఫున గొంతు విప్పి మాట్లాడుతామన్నారు. గత కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, ప్రజల ఆకలి కేకలు తప్ప మరేమి లేవని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
KTR Assembly Speech Today : ఇందిరమ్మ పాలన తెస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో గంజి కేంద్రాల దుస్థితి వచ్చిందన్నారు. గత కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మార్లు దర్శనమిచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి మంచినీటి సమస్యలు, నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాతబస్తీలో మైనార్టీ తీరని బాలికల వివాహాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నేతలు మిడిసిపడుతున్నారని, ప్రజలకు నేతల గుణం తెలుసన్నారు.