Telangana Driving Test : కొందరు డ్రైవింగ్ సరిగా నేర్చుకోకుండానే ఏజెంట్ల ద్వారా అడ్డదారుల్లో లైసెన్సులు పొందుతున్నారు. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. దీని అంతటికీ ఒకటే కారణం. వాహన డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అక్రమాలు చోటు చేసుకోవడమే. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అక్రమాలు నిలువరించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది.
అందులో భాగంగా రాష్ట్రంలో తొలి దశలో 21 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇవి అందుబాటులోకి వచ్చాక డ్రైవింగ్ లైసెన్సుల జారీలో మానవ ప్రమేయం అనేది ఉండదు. పరీక్షకు హాజరైన వ్యక్తికి లైసెన్సు ఇవ్వాలా? వద్దా? అనేది ఆ సాఫ్ట్వేరే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మాన్యువల్ విధానంలో డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తున్నారు. ఇందులో మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లదే కీలక పాత్ర. ఇక ముందు వాటిని ఇచ్చేది టెక్నాలజీనే. అందుకు అనుగుణంగా ఈ ట్రాక్లను ప్రభుత్వం సిద్ధం చేయనుంది.
పరీక్ష కోసం వచ్చే వాహనదారుల డ్రైవింగ్ను పరిశీలించడానికి ఆ ట్రాక్లలో కెమెరాలను బిగిస్తారు. నిర్దేశిత సమయంలో పరీక్ష పూర్తయ్యిందా లేదా రెడ్ సిగ్నల్ దగ్గర ఆగారా లేదా దాటేసి వెళ్లారా? ఇలా ప్రతి ప్రక్రియను కెమెరాల ద్వారా చిత్రీకరిస్తారు. ముఖ్యంగా ట్రాక్లో వాహనాన్ని సరిగా నడిపారా? గీత దాటారా? తదితరాలను టెక్నాలజీ ఆధారంగా పక్కాగా నమోదు చేయనున్నారు. డ్రైవింగ్ పరీక్షకు దరఖాస్తుదారే హాజరయ్యాడా లేదా ఇతరులు వచ్చారా అనేది కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా గుర్తిస్తారు.
భూ సేకరణ తర్వాత టెండర్లు : రాష్ట్రంలో తొలిదశలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లను ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రాలతో పాటు కొండాపూర్, మేడ్చల్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, మలక్పేట, పరిగి, నాగోల్, పెబ్బేరు, జహీరాబాద్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రవాణా శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ విషయంపై చర్చించారు. ఈ ప్రాంతాల్లో వచ్చే ఫలితాల ప్రకారం మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఒక్కో ట్రాక్కు 3 నుంచి 4 ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ విధంగా భూసేకరణ జరిపి త్వరలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి ట్రాక్లు : దిల్లీ, కర్ణాటక, ఒడిశా, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆధునిక విధానంలో టూ, త్రీ, ఫోర్ వీలర్ సహా భారీ వాహనాలకు డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తున్నారు.
టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్ వీలర్కు పెంచుకోండి - ఫోన్లోనే ఈజీగా ఇలా!