ETV Bharat / sukhibhava

బ్రేక్​ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారా? ఇదీ అసలు నిజం!

author img

By

Published : Mar 23, 2023, 5:06 PM IST

ఉదయం నిద్ర లేచిన తర్వాత తీసుకునే మొట్టమొదటి ఆహారంతో మన రోజు ప్రారంభమవుతుంది. ఉదయం పూట తినే అల్పాహారం శరీరానికి చాలా ముఖ్యం. అది మన శరీరంలో జీవక్రియలకు దోహదం చేస్తుంది. రోజంతా కేలరీలు ఎక్కువ ఖర్చు చేసేందుకు సహాయపడుతుంది. మన రోజూవారీ పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తినీ అందిస్తుంది. ఇవే కాదు బ్రేక్​ఫాస్ట్​తో ఇంకా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అలాగే దీనిని మానేయటం వలన ఆరోగ్య సమస్యలూ ఉత్పన్నమవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Breakfast Benefits For Healthy Lifestyle In Telugu
అల్పాహారం తినటం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు

ఉదయాన్నే అల్పాహారం తినటం చాలా అవసరమని.. ఆరోగ్యం బాగుండాలంటే ఉదయపు ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని అనేక అధ్యయనాల ఫలితాలను బట్టి తెలుస్తోంది. బ్రేక్​ఫాస్ట్​తో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. అంతేగాక చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే ఉదయం పూట అల్పాహారాన్ని తీసుకోవటం వలన అధిక బరువును నివారించవచ్చు. మనం ఉదయం నిద్ర లేచినప్పుడు మన శరీరంలోని రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని కండరాలు, మెదడు పనిచేయాలంటే రక్తంలో తగిన స్థాయిలో చక్కెర నిల్వలు ఉండాలి. బ్రేక్​ఫాస్ట్​ తినడం ద్వారా రక్తంలో చక్కెర శాతం శరీర అవసరాల మేరకు పెరుగుతుంది. ఉదయం ఆహారం తీసుకోకపోతే శరీరం పనిచేయటానికి తగిన ఇంధనం లభించకపోవటం వలన శక్తి పూర్తిగా తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. దీంతో తర్వాత సమయాల్లో రోజంతా అధికంగా ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది.

"ప్రతిరోజు బ్రేక్​ఫాస్ట్​ చేయడం చాలా ముఖ్యం. బ్రేక్​ఫాస్ట్​ చేసే సమయంలో మన శరీరంలో ఇన్సులిన్​ ఉత్పత్తి చక్కగా జరుగుతుంది. అందుకని మనం అల్పాహారానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదయం ఆహారం తీసుకోవడం ద్వారా లభించే ఇన్సులిన్​ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేగాక చక్కెర నిల్వలు కూడా మనకు బాగా ఉపయోగపడతాయి. ఎటువంటి మధుమేహ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​ను తప్పనిసరిగా చేయాలి. మన శరీరంలో ఇన్సులిన్​ స్రావము అయినప్పుడే మనం తినే ఆహారం లేదా కార్బోహైడ్రేట్స్​ శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇది మన శరీరానికి చాలా మంచిది.

ఉదయం సమయాల్లో​ బ్రేక్​ఫాస్ట్ చేయడం కాస్త ఆలస్యమైనప్పుడు డ్రైఫ్రూట్స్​, గింజలు, పండ్లు వంటివి తీసుకొని గ్రీన్​టీ తాగినా కూడా శరీరానికి మేలు జరుగుతుంది. కానీ, బ్రేక్​ఫాస్ట్​ మానేసి మరీ కాఫీలు, టీలు తీసుకోవడం వల్ల ఒంట్లో కెఫీన్​ స్థాయి​ పెరిగిపోతుంది. తద్వారా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీంతో అసిడిటీ, డీహైడ్రేషన్​ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే బ్రేక్​ఫాస్ట్​ను సరైన సమయంలో తీసుకుంటే చాలా మంచిది." అని చెబుతున్నారు డైటీషియన్ డాక్టర్​.గౌరీ ప్రియ మైలవరపు.

ఇవి తినాలి..
అల్హాహారం తీసుకున్నప్పుడు శరీరానికి అవసరమైన పోషకాలను ఉదయాన్నే అందుతాయి. పాలు, పండ్లు, ముడిధాన్యాలు వంటివి తీసుకోవడం ద్వారా ఉదయాన్నే తగినన్ని పోషకాలను శరీరానికి అందిచవచ్చు. అల్పాహారం మానేయటం అంటే పోషకాల కొరతను పెంచడమే. అలాగే రోజంతా ఆకలి ఎక్కువగా పెరిగి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహారాలను తినే అవకాశం ఉంది. ఉదయాన్నే పీచు, ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వలన రోజంతా ఆకలి అదుపులో ఉంటుంది. అప్పుడు తక్కువ పరిమాణంలో తిన్నా సరిపోతుంది. ఉదయం తినే టిఫిన్​ పేరుకు తగ్గట్టుగా అల్పాహారంగానే ఉండాలి. బ్రేక్​ఫాస్ట్​ ఎక్కువ మోతాదులో తిన్నవారు రోజంతా ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశమూ ఉందని అధ్యయనంలో తేలింది.

"బ్రేక్​ఫాస్ట్​ను మనం ఎక్కువగా తీసుకున్నా, తక్కువగా తిన్నా ఆకలి వేస్తుంటుంది. ఇందుకోసం కొందరు ఫ్రై చేసిన ఆహారాన్ని టిఫిన్ రూపంలో తీసుకుంటారు. దీంతో ఆకలి త్వరగా వేయదని అనుకుంటారు. కానీ, ఇది అపోహ మాత్రమే. ఉదయం తీసుకునే టిఫిన్​లో ప్రొటీన్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటి నుంచి లభించే ఫైబర్​, ప్రొటీన్స్ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా కొబ్బరి, పల్లీలు​, జీడిపప్పు వంటి వాటి నుంచి లభించే ప్రొటీన్స్​, ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరానికి కావాల్సిన శక్తినందిస్తాయి. అంతేగాక ఇడ్లీ, జొన్నలతో చేసిన ఆహారం వంటివి తీసుకుంటే లభించే పీచుపదార్థం ద్వారా కూడా త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. వీటితోపాటు కోడిగుడ్డును మన అల్పాహారంలో చేర్చుకుంటే చాలా మంచిది.

అల్పాహారం కింద తినే ఉప్మా వంటి పదార్థాల్లో కార్బోలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అయితే వీటిల్లో కూరగాయలు కూడా ఉండేలా చూసుకోవాలి. లేదంటే మీరు తిన్నది చక్కెరగానే మాత్రమే మారుతుంది. ఈ పదార్థాల్లో కూరగాయలు వేస్తే పీచుపదార్థం కూడా లభిస్తుంది. అంతేగాక విటమిన్లు, మినరల్స్​ కూడా శరీరానికి అందుతాయి. మనం బ్రేక్​ఫాస్ట్​ను మానేసి​.. తర్వాత తినే ఆహారాన్ని మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీని ద్వారా శరీరంలో చక్కెర​ స్థాయి​ కూడా పేరుకుపోతుంది. అయితే మనం తినే బ్రేక్​ఫాస్ట్​ కొంచెమైనా సరే అది ఆరోగ్యకరమైనదిగా ఉండేలా చూసుకోవాలి. అందులోనూ ఫైబర్​, ప్రొటీన్లు ఉండేవి వంటివి మాత్రమే తినాలి. దీని ద్వారా శరీర బరువు అదుపులో ఉంచుకోవచ్చు. షుగర్​ స్థాయులను కూడా నియంత్రించవచ్చు. దీంతో ఆరోగ్యంగా జీవించే ఆస్కారం ఉంటుంది." అని వివరించారు డైటీషియన్ డాక్టర్​.గౌరీ ప్రియ మైలవరపు.​

పిల్లల విషయంలో మరింత జాగ్రత్త..
పెరుగుతున్న వయసులో ఉన్న పిల్లలకు ఉదయపు ఆహారపు అవసరం మరింతగా ఉంటుంది. ఉదయం ఆహారం తీసుకొని పిల్లలు స్కూల్లో ఏకాగ్రతగా ఉండలేరని, త్వరగా అలసిపోతారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదయం క్రమం తప్పకుండా టిఫిన్​ చేసిన పిల్లలు తినని విద్యార్థుల కంటే కూడా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నట్లుగా ఓ అధ్యయనంలో తేలింది. అలాగే ఉదయం టిఫిన్​ మానేయటం వలన వారు రోజులో తర్వాత సమయాల్లో తినే జంక్​ ఫుడ్​​తో బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఉదయం టిఫిన్​ తినని పిల్లలకు స్కూల్లో విరామం సమయంలో తినేందుకు పండ్లు, డ్రైఫ్రూట్స్​​, ఖర్జూరం​ వంటివి చిరుతిండిగా ఇవ్వవచ్చు. ఉదయపు ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు వంటివి ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కొవ్వు శాతం తక్కువగా ఉన్న పాలు, పెరుగు, ముడిధాన్యాలతో తయారు చేసే ఆహారాలు గుడ్లు, పన్నీర్​ వంటివి కూడా తినవచ్చు.

చాలా మంది బరువు తగ్గేందుకు ఉదయం పూట తినే ఆహారాన్ని మానేస్తూ ఉంటారు. కానీ, ఇది ఏ మాత్రం మంచిది కాదు. అలాగని ఉదయాన్నే ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరమూ లేదు. నిద్ర లేచిన తర్వాత గంటలోపు ఏదైనా ఆహారం కొద్ది మొత్తంలో తీసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఉదయం తీసుకునే ఆహారంలో తగిన పోషకాలు ఉండేలా చూసుకుంటే రోజంతా శక్తిమంతంగా ఉండవచ్చు.

బ్రేక్​ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారా? ఇదీ అసలు నిజం!

ఉదయాన్నే అల్పాహారం తినటం చాలా అవసరమని.. ఆరోగ్యం బాగుండాలంటే ఉదయపు ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని అనేక అధ్యయనాల ఫలితాలను బట్టి తెలుస్తోంది. బ్రేక్​ఫాస్ట్​తో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. అంతేగాక చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే ఉదయం పూట అల్పాహారాన్ని తీసుకోవటం వలన అధిక బరువును నివారించవచ్చు. మనం ఉదయం నిద్ర లేచినప్పుడు మన శరీరంలోని రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని కండరాలు, మెదడు పనిచేయాలంటే రక్తంలో తగిన స్థాయిలో చక్కెర నిల్వలు ఉండాలి. బ్రేక్​ఫాస్ట్​ తినడం ద్వారా రక్తంలో చక్కెర శాతం శరీర అవసరాల మేరకు పెరుగుతుంది. ఉదయం ఆహారం తీసుకోకపోతే శరీరం పనిచేయటానికి తగిన ఇంధనం లభించకపోవటం వలన శక్తి పూర్తిగా తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. దీంతో తర్వాత సమయాల్లో రోజంతా అధికంగా ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది.

"ప్రతిరోజు బ్రేక్​ఫాస్ట్​ చేయడం చాలా ముఖ్యం. బ్రేక్​ఫాస్ట్​ చేసే సమయంలో మన శరీరంలో ఇన్సులిన్​ ఉత్పత్తి చక్కగా జరుగుతుంది. అందుకని మనం అల్పాహారానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదయం ఆహారం తీసుకోవడం ద్వారా లభించే ఇన్సులిన్​ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేగాక చక్కెర నిల్వలు కూడా మనకు బాగా ఉపయోగపడతాయి. ఎటువంటి మధుమేహ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​ను తప్పనిసరిగా చేయాలి. మన శరీరంలో ఇన్సులిన్​ స్రావము అయినప్పుడే మనం తినే ఆహారం లేదా కార్బోహైడ్రేట్స్​ శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇది మన శరీరానికి చాలా మంచిది.

ఉదయం సమయాల్లో​ బ్రేక్​ఫాస్ట్ చేయడం కాస్త ఆలస్యమైనప్పుడు డ్రైఫ్రూట్స్​, గింజలు, పండ్లు వంటివి తీసుకొని గ్రీన్​టీ తాగినా కూడా శరీరానికి మేలు జరుగుతుంది. కానీ, బ్రేక్​ఫాస్ట్​ మానేసి మరీ కాఫీలు, టీలు తీసుకోవడం వల్ల ఒంట్లో కెఫీన్​ స్థాయి​ పెరిగిపోతుంది. తద్వారా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీంతో అసిడిటీ, డీహైడ్రేషన్​ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే బ్రేక్​ఫాస్ట్​ను సరైన సమయంలో తీసుకుంటే చాలా మంచిది." అని చెబుతున్నారు డైటీషియన్ డాక్టర్​.గౌరీ ప్రియ మైలవరపు.

ఇవి తినాలి..
అల్హాహారం తీసుకున్నప్పుడు శరీరానికి అవసరమైన పోషకాలను ఉదయాన్నే అందుతాయి. పాలు, పండ్లు, ముడిధాన్యాలు వంటివి తీసుకోవడం ద్వారా ఉదయాన్నే తగినన్ని పోషకాలను శరీరానికి అందిచవచ్చు. అల్పాహారం మానేయటం అంటే పోషకాల కొరతను పెంచడమే. అలాగే రోజంతా ఆకలి ఎక్కువగా పెరిగి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహారాలను తినే అవకాశం ఉంది. ఉదయాన్నే పీచు, ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వలన రోజంతా ఆకలి అదుపులో ఉంటుంది. అప్పుడు తక్కువ పరిమాణంలో తిన్నా సరిపోతుంది. ఉదయం తినే టిఫిన్​ పేరుకు తగ్గట్టుగా అల్పాహారంగానే ఉండాలి. బ్రేక్​ఫాస్ట్​ ఎక్కువ మోతాదులో తిన్నవారు రోజంతా ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశమూ ఉందని అధ్యయనంలో తేలింది.

"బ్రేక్​ఫాస్ట్​ను మనం ఎక్కువగా తీసుకున్నా, తక్కువగా తిన్నా ఆకలి వేస్తుంటుంది. ఇందుకోసం కొందరు ఫ్రై చేసిన ఆహారాన్ని టిఫిన్ రూపంలో తీసుకుంటారు. దీంతో ఆకలి త్వరగా వేయదని అనుకుంటారు. కానీ, ఇది అపోహ మాత్రమే. ఉదయం తీసుకునే టిఫిన్​లో ప్రొటీన్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటి నుంచి లభించే ఫైబర్​, ప్రొటీన్స్ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా కొబ్బరి, పల్లీలు​, జీడిపప్పు వంటి వాటి నుంచి లభించే ప్రొటీన్స్​, ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరానికి కావాల్సిన శక్తినందిస్తాయి. అంతేగాక ఇడ్లీ, జొన్నలతో చేసిన ఆహారం వంటివి తీసుకుంటే లభించే పీచుపదార్థం ద్వారా కూడా త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. వీటితోపాటు కోడిగుడ్డును మన అల్పాహారంలో చేర్చుకుంటే చాలా మంచిది.

అల్పాహారం కింద తినే ఉప్మా వంటి పదార్థాల్లో కార్బోలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అయితే వీటిల్లో కూరగాయలు కూడా ఉండేలా చూసుకోవాలి. లేదంటే మీరు తిన్నది చక్కెరగానే మాత్రమే మారుతుంది. ఈ పదార్థాల్లో కూరగాయలు వేస్తే పీచుపదార్థం కూడా లభిస్తుంది. అంతేగాక విటమిన్లు, మినరల్స్​ కూడా శరీరానికి అందుతాయి. మనం బ్రేక్​ఫాస్ట్​ను మానేసి​.. తర్వాత తినే ఆహారాన్ని మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీని ద్వారా శరీరంలో చక్కెర​ స్థాయి​ కూడా పేరుకుపోతుంది. అయితే మనం తినే బ్రేక్​ఫాస్ట్​ కొంచెమైనా సరే అది ఆరోగ్యకరమైనదిగా ఉండేలా చూసుకోవాలి. అందులోనూ ఫైబర్​, ప్రొటీన్లు ఉండేవి వంటివి మాత్రమే తినాలి. దీని ద్వారా శరీర బరువు అదుపులో ఉంచుకోవచ్చు. షుగర్​ స్థాయులను కూడా నియంత్రించవచ్చు. దీంతో ఆరోగ్యంగా జీవించే ఆస్కారం ఉంటుంది." అని వివరించారు డైటీషియన్ డాక్టర్​.గౌరీ ప్రియ మైలవరపు.​

పిల్లల విషయంలో మరింత జాగ్రత్త..
పెరుగుతున్న వయసులో ఉన్న పిల్లలకు ఉదయపు ఆహారపు అవసరం మరింతగా ఉంటుంది. ఉదయం ఆహారం తీసుకొని పిల్లలు స్కూల్లో ఏకాగ్రతగా ఉండలేరని, త్వరగా అలసిపోతారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదయం క్రమం తప్పకుండా టిఫిన్​ చేసిన పిల్లలు తినని విద్యార్థుల కంటే కూడా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నట్లుగా ఓ అధ్యయనంలో తేలింది. అలాగే ఉదయం టిఫిన్​ మానేయటం వలన వారు రోజులో తర్వాత సమయాల్లో తినే జంక్​ ఫుడ్​​తో బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఉదయం టిఫిన్​ తినని పిల్లలకు స్కూల్లో విరామం సమయంలో తినేందుకు పండ్లు, డ్రైఫ్రూట్స్​​, ఖర్జూరం​ వంటివి చిరుతిండిగా ఇవ్వవచ్చు. ఉదయపు ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు వంటివి ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కొవ్వు శాతం తక్కువగా ఉన్న పాలు, పెరుగు, ముడిధాన్యాలతో తయారు చేసే ఆహారాలు గుడ్లు, పన్నీర్​ వంటివి కూడా తినవచ్చు.

చాలా మంది బరువు తగ్గేందుకు ఉదయం పూట తినే ఆహారాన్ని మానేస్తూ ఉంటారు. కానీ, ఇది ఏ మాత్రం మంచిది కాదు. అలాగని ఉదయాన్నే ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరమూ లేదు. నిద్ర లేచిన తర్వాత గంటలోపు ఏదైనా ఆహారం కొద్ది మొత్తంలో తీసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఉదయం తీసుకునే ఆహారంలో తగిన పోషకాలు ఉండేలా చూసుకుంటే రోజంతా శక్తిమంతంగా ఉండవచ్చు.

బ్రేక్​ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారా? ఇదీ అసలు నిజం!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.