కొవిడ్ బాధితులు చికిత్స పొందిన గదిని, వారు తాకిన ఇతర వస్తువులను రసాయన ద్రావణం పిచికారీతో శానిటైజేషన్ చేస్తున్నారు. అది అన్నిరకాలుగా శ్రేయస్కరం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. అప్పటికే ఆ వాతావరణమంతా వ్యాపించిన ఈ అతిసూక్ష్మ క్రిములను అంతం చేయాలంటే దానికి రసాయనాలు సరిపోవంటున్నారు. దానికి పరిష్కారంగానే యూవీ(అల్ట్రావయోలెట్) డిసిన్ఫెక్షన్ ట్రాలీని.. రూపొందించింది. నగరంలోని ప్రఖ్యాత ప్రయోగశాల ఏఆర్సీఐ(ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్). ఇందులో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మెకిన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలు భాగస్వామ్యమయ్యాయి.
అటూఇటూ తిరుగుతూ..
1.6 మీటర్ల ఎత్తు, 0.6 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ట్రాలీ ద్వారా ఓ గదిని అతి సులువుగా శుభ్రం చేయొచ్చు. ఇందులోని ఆరు యూవీసీ జెర్మిసిడల్ ట్యూబ్ల ద్వారా విడుదలయ్యే యూవీ కిరణాలు గది గోడలు, పరుపులు, వాతావరణంలోని వైరస్, బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఈ ట్రాలీని గదిలో అటూ ఇటూ తిప్పుతుండగా ఈ ట్యూబుల నుంచి వెలువడే 200, 300 నానోమీటర్ల పౌనఃపున్యంలో ఉండే ఈ కిరణాలు అతిసూక్ష్మ క్రిముల్ని పూర్తిగా నాశనం చేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులుగా వాడుతున్న రైల్వే బోగీలు, ఆసుపత్రి గదుల్లో దీన్ని వాడేలా తయారుచేశారు. 400 చదరపు అడుగుల గదిని అరగంటలో శుద్ధి చేస్తుంది.