Yadadri reconstruction works: పంచ నారసింహుల దివ్యక్షేత్రం యాదాద్రి... ఆధ్యాత్మికత, సంప్రదాయ, ఆధునిక హంగులు అద్దుకుంటోంది. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. ప్రధానాలయం తూర్పు రాజగోపురం ఎదురుగా పసిడి వర్ణంతో కూడిన దర్శన వరుసలు కనువిందు చేస్తున్నాయి. దర్శన క్యూలైన్ల పనులన్నీ దాదాపు పూర్తికావొచ్చాయని యాడా అధికారులు తెలిపారు. వైష్ణవతత్వం ఉట్టిపడేలా ఐరావతం, శంఖు, చక్ర, తిరునామాలు, మహా విష్ణు రూపాలు, ఆధ్యాత్మిక మందిరాల ఆకృతులు క్యూలైన్లలో తీర్చిదిద్దారు. వృద్ధులు సేద తీరేలా మధ్యలో బెంచీలు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేలా 10 చోట్ల ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేశామని ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి తెలిపారు.
![Yadadri reconstruction works, Yadadri Temple news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-22-yadadri-pasid-que-linelu-av-ts10134_22012022090031_2201f_1642822231_479.jpg)
హంగులు అద్దుకుంటున్న యాదాద్రి
Yadadri Temple news: మార్చి 28న జరిపే మహా సంప్రోక్షణకు ముందస్తుగా.. శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహిస్తారు. ఇందుకోసం సుమారు వందెకరాల్లో.... 1,008 కుండాలు, పర్ణశాలలు, మహాపర్ణశాల ఏర్పాట్లకు యాడా సిద్ధమవుతోంది. ఇప్పటికే నెయ్యి సేకరణకు టెండర్ నిర్వహించారు. మరోవైపు నిర్మాణాలు వేగవంతం చేస్తున్నారు. గర్భాలయానికి స్వర్ణ ద్వారాల బిగింపు పనులు పూర్తయ్యాయి. 37అడుగుల ఎత్తున్న ధ్వజస్తంభానికి స్వర్ణ తొడుగుల పనులు కొనసాగుతున్నాయి. పడమటి దిశలో దర్పణాన్ని అమర్చారు. దివ్య విమానాన్ని స్వర్ణమయం చేసేందుకు బంగారం సేకరణ కొనసాగుతోంది. బంగారు వర్ణంలో దర్శన, వరుసలను తీర్చిదిద్దారు. ఇకపోతే విద్యుదీకరణ పనులు పూర్తి కావొచ్చాయి.
![Yadadri reconstruction works, Yadadri Temple news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-22-yadadri-pasid-que-linelu-av-ts10134_22012022090031_2201f_1642822231_1003.jpg)
ముమ్మరంగా గండి చెరువు పనులు
Yadadri sri lakshmi narasimha swamy temple : యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి నిత్య కైంకర్యాలకు, భక్తుల పవిత్ర స్నానాలకు, భవిష్యత్తులో పుష్కరాల నిర్వహణకు వీలుగా పుణ్య గోదావరి గలగలమంటూ తరలివస్తోంది. నదీ తీరంలోని పుణ్యక్షేత్రాలను తలపించేలా యాదాద్రిని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కలకు అనుగుణంగా గండి చెరువు సిద్ధమవుతోంది. అందులో భాగంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గండిచెరువులోకి చేర్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. యాదాద్రికి వచ్చే భక్తుల పుణ్యస్నానాలకు వీలుగా కొండ కింద గండి చెరువు చెంత లక్ష్మీ పుష్కరిణి, కొండపైన స్వామి వారి కైంకర్యాల కోసం విష్ణు పుష్కరిణి నిర్మించిన విషయం తెలిసింది. వీటికి నిరంతరం నీరందించేలా గండి చెరువును రూ.33 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో నీటినిల్వ సామర్థ్యం పెంచడానికి వీలుగా ఎనిమిది మీటర్లలోతు పూడికతీస్తూ చుట్టూ రక్షణ గోడ(రిటైనింగ్ వాల్) నిర్మిస్తున్నారు. రక్షణ గోడ, వలయ రహదారి మధ్యలో ఆహ్లాదాన్ని పంచేలా ఉద్యానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చెరువులో మురుగు, వర్షాల తాలూకు వరద జలాలు కలవకుండా ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు. మూడు నెలలకోసారి కాళేశ్వరం జలాలు నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చెరువు నీరు బయటికి వెళ్లేలా మూడు మీటర్ల ఎత్తులో తూము(అప్టైన్ స్లూయిజ్) నిర్మిస్తున్నారు. ‘సైదాపూర్ కాల్వ నుంచి గండి చెరువులోకి గోదారి జలాలను తీసుకొచ్చే పైపులైన్ పనులు మొదలయ్యాయి. గండి చెరువులో ఎప్పుడూ పరిశుభ్రమైన నీళ్లే ఉండేలా నిర్మాణాన్ని తీర్చిదిద్దుతున్నాం. మార్చి 28న జరిగే ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణకు ముందే అన్ని పనులు పూర్తిచేస్తాం’ అని ఆర్అండ్బీ డీఈఈ బీల్యానాయక్ తెలిపారు.
ఇవీ చదవండి: