విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇన్నోవేషన్ సెల్, ఇంక్విలాబ్ ఫౌండేషన్, యూనిసెఫ్లు దేశవ్యాప్తంగా ఇన్నోవేషన్ ఛాలెంజ్-2020 నిర్వహించాలని సంకల్పించాయి. ప్రప్రథమంగా తెలంగాణలో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులను ఎంపిక చేసి గత ఏడాది సెప్టెంబర్లో ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఉద్దేశం గురించి, జూమ్ యాప్ ద్వారా శిక్షణ ఇచ్చారు. సృజన ఆవిష్కరణకు సంబంధించిన విద్యార్థుల ఆలోచనలు సేకరించి ఆన్లైన్లో వెబ్ సైట్ ద్వారా అప్లోడ్ చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి 7,093, బృందాలు పాల్గొనగా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 860 బృందాలు తమ ఆలోచనలు పంపాయి. వీటన్నిటిని పరిశీలించిన నిపుణుల బృందం రాష్ట్రవ్యాప్తంగా అత్యున్నతమైన 25 పాఠశాలకు చెందిన విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపిక చేశారు. అందులో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో నుంచి ఒక్కోకటి ఎంపికయ్యాయి. వీరంతా హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి జడ్పీ పాఠశాల విద్యార్థినులు 'ఆర్గానిక్ జీరో సానిటరీ వేస్ట్ ప్యాడ్' తయారీపై రూపొందించిన ప్రాజెక్టు మొదటి స్థానంలో నిలిచింది. ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్ చేతులమీదుగా విద్యార్థినులు షీల్డ్తో పాటు 75 వేల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు.
సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్
స్త్రీలు రుతుచక్ర సమయంలో మార్కెట్లో దొరికే పలురకాల ప్యాడ్లను వాడుతుండటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అందుబాటులో దొరికే ఔషధ మొక్కల నుంచి తీసిన రసాయనాలతో ముల్కలపల్లి జడ్పీ పాఠశాలకు చెందిన డి.అనిత, బి స్వాతి, డి.శైలజలు 'స్త్రీ రక్షాప్యాడ్ల' ను రూపొందించి గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శించి మంత్రితో పాటు నిపుణుల బృందాన్ని సైతం ఆకట్టుకున్నారు..
సృజనాత్మకతను చాటుకున్నారు.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్లను విద్యార్థులతో తయారు చేయించాలని అనుకున్నాం. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల శానిటరీ ప్యాడ్లు ఉన్నాయి. వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల ఆర్గానిక్ జీరో వేస్ట్ స్త్రీరక్ష ప్యాడ్లు తయారు చేయించాము. మేము ఊహించిన దాని కన్నా భిన్నంగా విద్యార్థులు ప్యాడ్లు తయారుచేసి, తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఇన్నోవేషన్ ఛాలెంజ్లో రాష్ట్ర ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.. -పి.కళ్యాణి, జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు
గర్వంగా ఉంది
మేము యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తండావాసులం. నిరుపేద కుటుంబాలు మావి. మా తల్లిదండ్రులు రోజువారి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా చదువుతున్నాము. తల్లిదండ్రుల సహకారం, సైన్స్ టీచర్ కళ్యాణి ప్రోత్సాహం వల్ల ఔషధ గుణాలు ఉన్న ప్యాడ్లను తయారు చేశాం. మా ఆలోచన రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రథమ బహుమతి గెలుస్తుందని అనుకోలేదు. మమ్మల్ని ఉపాధ్యాయులు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. మొదటి బహుమతి గెలిచుకున్నందుకు మాకు గర్వంగా ఉంది. ప్యాడ్లు వినియోగించే వారికి సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయని తెలుసుకొని ఇలా వినూత్నంగా ఆలోచించాం. టీచర్ సలహాలు తీసుకున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్యాడ్ను తయారుచేశాం. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు సహాయ సహకారాలు అందించారు. - పి.నాగరాణి, విద్యార్థిని
ఇదీ చదవండి: కొవిడ్ ని'బంధనాలు': రామయ్య దర్శనానికి నోచుకోని వృద్ధులు, పిల్లలు