యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలోని మూసీ వంతెన వద్ద తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ముందు వెళ్తున్న లారీని దాటేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. అదే సమయంలో బస్సు డ్రైవర్ ఎడమవైపు తిప్పటం వల్ల లారీ వెనుక భాగాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బస్సు, కారు, లారీ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది.
ప్రమాదానికి ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ఉన్న ప్రయాణికులు బస్సు డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని ట్రాఫిక్ని పునరుద్ధరించారు. ఆర్టీసీ బస్సును పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.