యాదాద్రీశుడి ఆలయంలోని ప్రాకారాలు, ముఖ మండపంలో వాన పడినప్పుడు కురుస్తుండటం వల్ల అధికారులు వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. వేంచేపు మండపంలో కురవకుండా రసాయనికి గమ్ము పూశారు. ప్రధాన ఆలయ ప్రాకారాల్లో డంగు సున్నం వేశారు. నాణ్యత లోపం వల్ల గట్టిపడలేదు. దీనివల్ల వాననీరు కురుస్తోంది. ప్రస్తుతం సాంకేతిక కమిటీ సూచనల మేరకు మొదట వేసిన డంగు సున్నం తొలగించి మళ్లీ డంగు సున్నంతోనే మరమ్మతు చేస్తున్నారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి.
దక్షిణ రాజగోపురం మెట్లు కుంగిపోవడం వల్ల వాటిని తొలగించి మరమ్మతు చేస్తున్నారు. ప్రధాన ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీకి అమర్చే పలకలపై శిల్పులు అందమైన బొమ్మలు చెక్కుతున్నారు. ఇప్పటికే శంఖు, చక్ర, తిరుణామాల నగిషీలతో తయారు చేసిన గ్రిల్స్ను అమర్చారు. ప్రహరీకి మొదట సిమెంట్తో ప్లాస్ట్రింగ్ చేసి రంగులు వేయాలనుకున్నారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు కృష్ణ శిలను పోలిన గ్రానైట్ అమర్చాలని నిర్ణయించిన ఐటీడీఏ అధికారులు పనులు వేగవంతం చేశారు. గ్రానైట్పై పువ్వుల నగిషీలు చెక్కి, ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రహరీపై రంగురంగుల విద్యుత్ దీపాలు అమర్చడానికి ఎలక్ట్రికల్ పనులు ఇప్పటికే పూర్తి చేశారు.