నల్గొండ జిల్లాలో మొత్తం 15 కేసులు నమోదవగా.. వారంతా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. దశల వారీగా కోలుకొని ఇప్పటి వరకు 14 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఒక్కరే అక్కడ చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని కంటైన్మెంట్ జోన్లలో 28 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో వాటిని ఇటీవలే అధికారులు ఎత్తివేశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరెంజ్, రెడ్ జోన్లలో మూడు వారాల పాటు (21 రోజులు) కరోనా కేసులు నమోదు కాకుంటే ఆ జిల్లాను గ్రీన్ జోన్గా అధికారులు ప్రకటిస్తారు. నల్గొండలో చివరి కరోనా కేసు నమోదై నేటికి (శనివారానికి) 21 రోజులు పూర్తవుతాయి. దీంతో నేడోరేపో నల్గొండ జిల్లా గ్రీన్జోన్లోకి మారనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
కుదుటపడుతున్న సూర్యాపేట
ఒకానొక దశలో కరోనా కేసులు అధికంగా నమోదైన సూర్యాపేట జిల్లా ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఇక్కడ గత నెల 23న చివరి పాజిటివ్ కేసు నమోదైంది. మొత్తం 83 కేసుల్లో ఇప్పటి వరకు 52 మంది డిశ్చార్జి కాగా.. శుక్రవారం మరో ఇద్దరు కోలుకుని ఇంటికి వచ్చారు. ప్రస్తుతం మరో 29 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మరో వారం ఇదే పరిస్థితి కొనసాగితే ఈ జిల్లా కూడా రెడ్ జోన్ నుంచి ఏకంగా గ్రీన్జోన్లోకి మారే అవకాశాలున్నాయి.
శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్లో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాను ఆరంజ్ జోన్ పరిధిలోకి మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో పట్టణంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరుచుకుంటుండగా, సిమెంటు, హార్డ్వేర్, ఇతర దుకాణాల యజమానులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఇప్పటికే ఇక్కడ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ నేతృత్వంలో లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు.
యాదాద్రిలో..
యాదాద్రిభువనగిరి సరిహద్దు జిల్లాలో నిత్యం కరోనా కేసులు నమోదవుతున్నా ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పని నిమిత్తం ముంబాయి వెళ్లి తిరిగి వచ్చిన సంస్థాన్నారాయణపురం జనగాంకు చెందిన ముగ్గురికి గురువారం కరోనా పాజిటివ్ వచ్చింది. ముంబయి, ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా అనే కోణంలో అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పర్యవేక్షిస్తున్నారు.
ఈనెల 4న వచ్చి క్వారంటైన్లో ఉన్న ఇదే మండలానికి చెందిన మరో నలుగురుని గురువారమే హైదరాబాద్ తరలించారు. వీరికి కరోనా సోకలేదని తెలిసింది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి కొలువులకు హాజరుకావడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అందరూ స్థానికంగానే నివాసం ఉండాలని జిల్లా కలెక్టరు అనితా రామచంద్రన్ స్పష్టంగా సూచించినా ఇప్పటికీ కొందరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు జిల్లాలో మండల, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హోటళ్లు మినహా అన్ని దుకాణాలను తెరుస్తున్నారు. భువనగిరిలోనూ సరి, బేసి విధానాన్ని అమలుచేస్తూ కేంద్ర, రాష్ట్రం ప్రకటించిన మార్గదర్శకాలను పాటించని వారిపై అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.