వృద్ధాప్యంలో మోకాళ్ల నొప్పులు తీవ్రంగా బాధిస్తుంటాయి. కొందరు వృద్ధులు అడుగు తీసి అడుగు వేయాలంటే ఇబ్బంది పడుతుంటారు. ఆ వయసులో వారు శస్త్ర చికిత్స ఒక్కటే మార్గం అనుకుంటారు. హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ వారు ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల తొడుగుల ద్వారా వృద్ధులకు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో ఇటీవల 3రోజుల పాటు ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని పీఎన్ఆర్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేశారు.
వృద్ధులకు 'శ్రద్ధ'గా ఆసరా
పోచంపల్లిలో శ్రద్ధ ప్రాజెక్టు పేరుతో వృద్ధులకు మోకాళ్ల తొడుగులు అందిస్తోంది హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ. ముందుగా మండలంలో మొత్తం 9 గ్రామాల్లో వందకు పైగా వృద్ధాప్య సంఘాలను ఏర్పాటు చేసింది. ఇందులో 1312 మంది సభ్యులుగా ఉన్నారు. మొదట మోకాళ్ల నొప్పులు ఉన్న వృద్ధులకు వైద్యునిచే పరీక్ష చేయించి అవసరమైన వారికి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వైద్యుల బృందం మోకాళ్ల కొలతలు తీసుకుని వాటికి అనుగుణంగా తొడుగులను తయారు చేస్తారు. పరికరాన్ని ఎలా వినియోగించాలో వైద్యులు రోగులకు వివరిస్తారు. వివిధ గ్రామాల నుంచి వృద్ధులను తీసుకురావడానికి రవాణా, మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు.
ఫ్లోరైడ్ నీరే కారణం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగు నీటిలో ఫ్లోరైడ్ ఉండడం ముఖ్య కారణమని ప్రముఖ వైద్యడు డా. విజయ్ నాయక్ అన్నారు. వృద్ధాప్యలో మోకాళ్ల నొప్పులు సర్వ సాధారణమైనప్పటికీ.. వంశ పారంపర్యం, జీవన విధానం, ప్రమాదాలు సంభవించినప్పుడు కీళ్లు, మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలిపారు. శస్త్ర చికిత్స లేకుండా మోకాళ్ల తొడుగుల ద్వారా ఉపశమనం లభిస్తుందని అన్నారు. ఈ తొడుగులకు పేటెంట్ హక్కులను కూడా కలిగి ఉన్నామని వివరించారు.
పీఎన్ఆర్ సోసైటీ సహకారంతో
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి హెల్ప్ ఏజ్ ఇండియా, పీఎన్ఆర్ సొసైటీ సహకారంతో ఉచితంగా అందిస్తోంది. పోచంపల్లిలో గతంలో 200 మందికి మోకాళ్ల తొడుగులు అందించామని ఈసారి మరో రెండు వందల మందికి అందిస్తామని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ రాకేష్ తెలిపారు.
తమపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న హెల్ప్ఏజ్ ఇండియాకు వృద్ధులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మోకాళ్ల తొడుగుల వల్ల నొప్పి లేదని ఆనందంగా చెబుతున్నారు. వృద్ధులకు సేవ చేయడానికి ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందించదగ్గ విషయం. మలి వయసు వారికి ఇలాంటి సేవలు, శిబిరాలు మరింతగా చేరువ చేయాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి : పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించాడు