యాదాద్రి(yadadri) శ్రీలక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రం(sri lakshmi narasimha swamy temple) భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తవత్సలుని క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఉదయం నుంచి కొండపై బాలాలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. మొక్కు పూజలతో మండపాల్లో రద్దీ నెలకొంది. స్వామివారికి నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

భక్తుల వ్రత పూజలు
నారసింహుని నిత్యకల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని... మొక్కులు తీర్చుకుంటున్నారు. మొక్కు కల్యాణాలు, వ్రత పూజల్లో భక్తులు పాల్గొంటున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

అనుమతి నిరాకరణ
స్వామి ధర్మ దర్శనానికి 2 గంటలు సమయం... ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతి నిరాకరిస్తున్నారు.

ప్రత్యేక దృష్టి
మరోవైపు యాదాద్రి ఆలయ భద్రత ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులు, ఇంటిలిజెన్స్, రాచకొండ ఐటీ కోర్ బృందాలు పాల్గొన్నాయి. నిఘా కెమెరాల బిగింపు కోసం స్థలాల ఎంపిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు.

అధికారుల కసరత్తు
యాదాద్రిలో పునర్నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయం ఉద్ఘాటన కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) సీఎం కేసీఆర్కు(CM KCR) హామీ ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్టోబరు- నవంబరు నెలల్లో ముహూర్తం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో కొండపైన కట్టడాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన దసరాలోగా పూర్తిచేయాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (YTDA) భావిస్తోంది. ప్రారంభోత్సవం నాటికి భక్తులకు మౌలిక వసతుల కల్పన, పచ్చదనం పనులు పూర్తిచేసేందుకు గుత్తేదారులతో సమీక్ష నిర్వహణకు యోచిస్తున్నారు.
సామాన్యులకు వేద ఆశీర్వచనం
యాదాద్రి(yadadri) శ్రీలక్ష్మి నరసింహస్వామివారి(sri lakshmi narasimha swamy) ఆలయంలో వేద ఆశీర్వచనం పూజా కైంకర్యాన్ని ఆలయ ఈవో గీతా రెడ్డి ఇటీవలె ప్రారంభించారు. గతంలో వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే వేద ఆశీర్వచనం చేసేవారు. కానీ ఆలయ అధికారుల తాజా నిర్ణయంతో రూ.516 టిక్కెట్ తీసుకునే భక్తులకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. సాధారణ భక్తులు కూడా రూ.516 టికెట్ కొనుగోలు చేస్తే వేద ఆశీర్వచనం చేసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: KTR on Seed Copters: దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో సీడ్ కాప్టర్లు