యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్థులు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అడ్డుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
అనంతరం వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి.. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భువనగిరి ఏసీపీ భుజంగరావు, అధికారులు నిర్వాసితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అదనపు కలెక్టర్ ఖీమా నాయక్ నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు.