రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం వల్ల వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో జాప్యం జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రూ.120 కోట్లకు గానూ... కేంద్రం రూ.106 కోట్లు వెచ్చిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లకు రూ.10 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆయన కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు అందనున్న వివిధ వైద్య సేవలు... అత్యాధునిక పరికరాల లభ్యతపై ఆరా తీశారు.
ఆసుపత్రి పూర్తికావచ్చినా వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం కూడా ఇంతవరకూ చేపట్టలేదని కిషన్ రెడ్డి అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో మోదీ సర్కార్... సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఆరేళ్ల క్రితం శ్రీకారం చుట్టిందని తెలిపారు. యుద్ధప్రాతిపదికన ఆసుపత్రికి ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అంతకుముందు... కిషన్ రెడ్డి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు... ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదాశీర్వచనాలు పలికి కేంద్రమంత్రికి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఇదీ చదవండి : భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి