Son became a lawyer to get justice for his mother story: ఒక ఐదు దశాబ్దాలు వెనక్కి వెళితే 1971లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన సులోచనకు అదే వరంగల్ నగరంలో నివాసం ఉంటున్న పాము సోమయ్యకు వివాహం జరిగింది. వీరికి శరత్బాబు, రాజా రవికిరణ్ ఇద్దరు కుమారులు కలరు. తరవాత భార్యభర్తలు మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ ఘర్షణ మొత్తాన్ని పెద్ద కుమారుడైన శరత్బాబు గమనిస్తూనే ఉండేవాడు. ఈ దంపతులు ఇద్దరు చివరకు 1992లో కలిసి ఉండడం కన్నా విడిపోవడమే మేలు అని భావించి విడాకులు తీసుకున్నారు. సులోచన తన ఇద్దరి కుమారులతో తన పుట్టింటికి వెళ్లి, తన కుమారులను పెద్దవారిని చేసింది.
![Man studies law, wins alimony for his mother after 30 years](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2022-11-02-at-23816-pm_0311newsroom_1667458418_175.jpeg)
విడాకులు తీసుకొని 30 సంవత్సరాలు అయినాసరే తన భర్తనుంచి రావలసిన భరణం రాలేదు. ఎన్నిసార్లు వరంగల్ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. అయితే ఈమెకు 1997లో ఒకసారి కోర్టులో డిక్రీ వచ్చింది.. కానీ ఆమెకు న్యాయవాది సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అది తెలియలేదు. తల్లికి న్యాయం జరగాలని పెద్ద కుమారుడు ఇంటర్ చదువుతూనే తీర్పు ప్రతి కోసం ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. అలాగని ఎన్నడూ నిరాశ చెంది పోరాటం ఆపలేదు.
తల్లి కేసునే మొట్టమొదట వాదించాడు: తన తల్లికి న్యాయం జరగాలంటే తానే లాయర్ కావాలని శరత్బాబు గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆదిలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. తన నమ్మకంతో 2019లో ఎల్ఎల్బీని పూర్తి చేసి న్యాయవాద వృత్తిలోకి చేరాడు. 30 ఏళ్ల తర్వాత స్వయంగా న్యాయవాద వృత్తి చేపట్టిన ఆయన.. మొట్టమొదటగా తన తల్లి కేసునే వాదించాడు. 2021 ఆగస్టులో పాత డిక్రీ ప్రతిని సంపాదించి.. దాని ఆధారంగా తల్లి భరణానికి మరలా కోర్టులో కేసు వేశారు. చివరికి తన శ్రమ వృథా కాకుండా విజయం సాధించారు. ఈ వివాదం లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమై, తన తల్లికి తండ్రి నుంచి నెలకు రూ.30వేలు చొప్పున భరణం ఇవ్వాలని సెప్టెంబరు 19న రాజీ కుదిరింది. పట్టువదలని విక్రమార్కుడిలా కుమారుడు చేసిన పోరాటంతో 30 ఏళ్ల తర్వాత ఆ తల్లికి న్యాయం జరిగినట్లయింది.
ఇదీ చదవండి :
1. 'లా చదివి ప్రయోజకుడై కేసు గెలిపించినందుకు సంతోషంగా ఉంది'
2.తల్లికి న్యాయం చేయడానికి లాయర్ అయ్యాడు.. ఇంకో స్టూడెంట్నెం.1 విజయగాథ