ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తెరాస తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి వరంగల్ పట్టణ జిల్లాలో పర్యటించారు.
హంటర్ రోడ్లోని అభిరామ్ గార్డెన్లో జరిగిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ప్రసంగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను చాలా వరకు పూర్తి చేశామని... కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గి కొన్ని పనులు మాత్రమే మిగిలిపోయాయని మంత్రి అన్నారు. కరోనా వైపరీత్యంలోనూ సంక్షేమ పథకాలను మాత్రం ఆపడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పనితీరుని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను మంత్రి కోరారు.
ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం పరితపించిన విధంగానే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులతో నీటిని తెచ్చుకున్నామని, సాగునీరు, తాగునీటికి కొరత లేకుండా చేసుకున్నామన్నారు. ఇక మన నిధులు మనమే ఉపయోగించుకుంటుండగా... ఉద్యోగాల కల్పనలోనూ ముందున్నామన్నారు. ప్రజల పక్షాన సీఎం కేసీఆర్తో మాట్లాడి ఇక్కడి ప్రాంత అభివృద్ధికి పాటు పడతామని పల్లా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తెరాస నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: డీకే అరుణ