వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లో టెక్నోజీయాన్ వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు...నూతన ఆవిష్కరణలతో సరికొత్త ప్రయోగాలతో ఈ సాంకేతిక వేడుకల్లో పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 5 వేలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.
'సృజనాత్మకత... సాంకేతికత అంశాల్లో ప్రతిభను వెలికితీయాలి'
విద్యార్థులే నిర్వాహకులై అత్యంత సందడిగా జరిగే టెక్నోజీయాన్-2019 ఘనంగా ప్రారంభమైంది. నూతన ఆవిష్కరణలు అనే అంశంతో నవంబర్ 1 నుంచి 3 వరకు వరంగల్ నిట్లో జరగనున్న ఈ సాంకేతిక వేడుకలను డీఆర్డీవో విశ్రాంత కన్సల్టెంట్ పద్మశ్రీ ఎన్.దివాకర్ లాంఛనంగా ప్రారంభించారు. నిట్ సంచాలకులు ఎన్వీ రమణారావు, అడ్రోయిటిక్ సొల్యూషన్ సీఈవో ఆయుష్, విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి సాంకేతికత, వైజ్ఞానిక అంశాల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని ఎన్వి రమణారావు పేర్కొన్నారు.
'టెక్నోజీయాన్ ద్వారా... ప్రతిభను పెంచుకునే అవకాశం'
నేటి నుంచి సాంకేతిక వేడుకలు మొదలుకానున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5 వేలకు పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. వివిధ అంశాలపై 14 కార్యశాలలు, విద్యార్థి క్లబ్ల ఆధ్వర్యంలో 55కి పైగా సాంకేతిక, వైజ్ఞానిక అంశాల్లో ఆకట్టుకునే రీతిలో విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. భవిష్యత్ను శాసించే సాంకేతిక పరిజ్ఞానం, నానో టెక్నాలజీ, అంతరిక్ష పరిజ్ఞానం, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు తదితర అంశాలపై ప్రసంగించనున్నారు.
సాంకేతికత పరంగా ప్రతిభను పెంచుకునే అవకాశం ఈ వేడుకల ద్వారా కలుగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు. సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు సందడి చేయనున్నారు. వేడుకల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రశంస పత్రాలతో పాటు 4 లక్షల రూపాయల వరకు నగదు బహుమతులను అందజేయనున్నారు.
ఇవీ చూడండి : సృజనాత్మక నగరాల నెట్వర్క్లో హైదరాబాద్