వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఉపాధిహామీ పథకాన్ని మొట్టమొదటి సారి నీటిపారుదల శాఖకు అనుసంధానం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రూ.1,230 కోట్ల పనులు పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈ పనులను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి నగరాలు విడిచి పల్లెబాట పట్టిన శ్రమజీవులకు ఈ పథకం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.