వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. కరెంటు స్తంభాల మార్పు పనులు పూర్తికావచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. వారంలోగా మిషన్ భగీరథ పైపులైన్ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ ప్రధాన కూడల్లో జంక్షన్ డెవలప్మెంట్ చేయాలని సూచించారు. రోడ్ల వెడల్పులో ఇళ్లులు కోల్పోయిన వారికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. ఇల్లు మంజూరై ఇంకా నిర్మాణం ప్రారంభించని వారు వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనుల వేగం పెంచాలి...
మండలంలోని కటాక్షపూర్ గ్రామంలో రూ.3కోట్ల 77 లక్షలతో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే శనివారం ఉదయం పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులకు ఆదేశించారు. జూన్ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందివ్వాలన్నారు. అందుకు కావాల్సిన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు.