పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా మన సంక్షేమ పథకాలు నిలిచాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, నడికూడ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 144 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను చల్లా పంపిణీ చేశారు. రూ.1కోటి 44లక్షల విలువచేసే ఈ చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందచేశారు.
పేదింటి ఆడబిడ్డకు అండగా..
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికంగా అండగా కళ్యాణలక్ష్మి పథకం నిలుస్తోందన్నారు. 1,00,116 రూపాయలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నేరుగా లబ్ధిదారులకు అందిస్తోన్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో తక్కువమందికి పింఛన్లు ఇచ్చేవారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నామన్నారు.
అప్పుడు.. ఇప్పుడు..
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండేదో, వారి ఏడేండ్ల పాలనలో ఏ స్థాయిలో అభివృధ్ధి చెందిందో ప్రజలు ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు భాజపా నాయకులు అడ్డుకుంటున్నారన్నారు.
ఇదీ చూడండి: గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న పబ్లిక్ గార్డెన్