కొత్త పురపాలక చట్టం 2019 ప్రకారం ఆస్తిపన్ను వసూలు చేసేందుకు పురపాలక శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. గత నాలుగైదు నెలలుగా భువన్ సర్వే నమోదులు ఆన్లైన్లో వేగవంతం చేయడంతో వాటిని అక్టోబర్ నుంచి అమల్లోకి తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు కేవలం ఇంటి నిర్మాణ కొలతల ఆధారంగా పన్ను విధించి వసూలు చేసిన ప్రభుత్వం తాజాగా ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలానికి కూడా పన్ను విధించే విధానానికి కొత్త సాఫ్ట్వేర్లో రూపకల్పన చేసింది.
దీంతో పన్నులు మూడింతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదైన విలువ ఆధారంగా ఆయా ఆస్తుల విలువలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా రూపొందించిన సాఫ్ట్వేర్లో వార్డులోని ఇంటిని నమోదుచేస్తే చాలు పన్ను ఎంత మొత్తం వసూలు చేయాలో అదే లెక్కలు చూపుతుంది.
సర్వేతో ఆందోళన: పురపాలక శాఖ ఆదేశాలతో 2020 సంవత్సరంలో మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇస్రో భువన్ సర్వేను తాత్కాలిక సిబ్బందితో నమోదుచేసే కార్యక్రమానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఒక్కో సర్వేకు ఇంత మొత్తం అంటూ వేతనం అప్పగించడంతో వారు ‘ఎంత నమోదు చేస్తే అంత’ అన్నట్లుగా నమోదులు ఎక్కువగా చేశారు. అయితే నమోదుపై అవగాహన లేకుండా హడావుడిగా కొలతలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.
ఆ సమయంలో చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నా వాటి వివరాలను సైతం గుడ్డిగా నమోదుచేసినట్లు వెల్లడైంది. ఇలా భువన్లో నమోదు చేయడంతో ఆయా ఇళ్లు, స్థలాల విలువ ఆధారంగా పన్నులు తడిసి మోపెడయ్యాయన్నట్లుగా పెరిగాయి. ఉదాహరణకు కొత్తకోటలో తాజాగా 7 వేలకు పైగా ఆస్తులు ఉండగా 458 ఆస్తుల్ని భువన్లో నమోదుచేసి వాటి నుంచి వచ్చే పన్నులను అంచనా వేయగా రూ.7.82 లక్షలుగా లెక్క తేలింది.
గృహ, నివాస ఆస్తులకు ఒక మొత్తాన్ని, వాటికి రెట్టింపు మొత్తాన్ని వాణిజ్య సముదాయాలున్న భవనాలు, కట్టడాలకు పన్ను విధించేలా సాప్ట్వేర్ను తయారుచేశారు. వాస్తవానికి పాత పన్నులు రూ.3 లక్షల వరకు వసూలవుతాయి. ఈ కారణంగా మరోసారి ఆస్తుల కొలతల్ని లెక్కించాలన్న డిమాండ్ పన్నుదారుల నుంచి వస్తోంది.
విలీన గ్రామాలపై తీవ్ర ప్రభావం: పురపాలక సంఘం పరిధిని విస్తరించాలని పట్టణ సమీపంలోని పలు గ్రామాల్ని విలీనం చేయగా ఆయా ప్రాంతాలపై భువన్ సర్వే ప్రభావం పడింది. చిన్న పంచాయతీలుగా ఉన్న ఇవి పురపాలికగా పురోగతి చెందగా సౌకర్యాలు మాత్రం అక్కడే ఆగిపోయాయి. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా నిరుపేదలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయం నమోదుచేసిన విలువ ప్రకారమే పన్నులు చెల్లించాల్సి వస్తోంది.
ఇప్పటికే ఇంటి నిర్మాణం కోసం పడుతున్న ఇబ్బందులకు తోడు పన్నుల బాదుడుపై గృహస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వనపర్తి పురపాలికలో నాగవరం, నర్సింగాయపల్లి, రాజనగరం, శ్రీనివాసపురం గ్రామాలను పట్టణంలో విలీనం చేయగా, పెబ్బేరు పురపాలికలో చెలిమిల్ల గ్రామాన్ని చేర్చారు. ఆత్మకూర్ పురపాలికలో కానాపురం గ్రామాన్ని చేర్చగా ఇప్పుడవి పన్నుల భారాన్ని మోయాల్సి వస్తోంది.
కాస్త ఖాళీ స్థలం ఉండి అందులో చిన్న గుడిసె ఉన్నా మొత్తం స్థలానికి పన్నులు చెల్లించే పరిస్థితి ఉండడంతో నిరుపేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు 75 చదరపు అడుగులలోపు నిర్మాణాలకు రూ.100 చొప్పున మాత్రమే పన్ను వసూలు చేయాల్సి ఉన్నా ఆవరణలోని ఖాళీ స్థలానికి పన్నులు విధించనున్నారు.
![](https://assets.eenadu.net/article_img/Capture2_134.jpg)
లోపాలుంటే సరిచేస్తాం: పురపాలక శాఖ ఆదేశాలతో ఆస్తుల్ని భువన్ సర్వే ద్వారా లెక్కిస్తున్నాం. రిజిస్ట్రేషన్ కార్యాలయ విలువ ఆధారంగా ఆయా ప్రదేశాల్లో ఆస్తుల విలువలను యాప్లో నమోదు చేశారు. వాటి ఆధారంగా యాప్ సాయంతో పన్నులు లెక్కించి వాటంతటవే నమోదవుతున్నాయి. ఈ ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరింది. పన్నులు మాత్రం అక్టోబర్ నుంచే అమల్లోకి వస్తాయి. ఎవరైనా ఆస్తులు తప్పుగా నమోదైనట్లు గుర్తిస్తే మా దృష్టికి తీసుకురావాలి. వాటిని మళ్లీ పరిశీలించి సరిచేస్తాం.
ఇవీ చదవండి: