డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించడం లేదని ఆవేదన చెందిన గ్రామస్థులు ఆక్రమించుకున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాలలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా 52 పడక గదుల ఇళ్లను నిర్మించింది. కానీ లబ్ధిదారులను మాత్రం ఎంపిక చేయలేదు. ఇటీవల తమకు కేటాయించాలంటూ అధికారులకు గ్రామానికి చెందిన 190 మంది దరఖాస్తులు సమర్పించారు. అధికారులు స్పందించకపోవడం వల్ల అసహనానికి లోనైన 50 మంది గ్రామస్థులు మంగళవారం ఆక్రమించుకున్నారు.
పంచాయతీరాజ్ ఏఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని ఇళ్లను ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు సూచించారు. త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి రెండు పడక గదుల ఇళ్లను అందిస్తామని తహసీల్దార్ జవహర్లాల్ తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆక్రమించిన ఇళ్లను ఖాళీ చేసి వెళ్లారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని తమకు ఇళ్లను మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : అమ్మకి గుండెపోటని వెళ్లాడు... కన్పించకుండాపోయాడు