సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన 35 సంవత్సరాల ఓ వ్యక్తి.. దీర్ఘకాలిక వ్యాధితో గురువారం సాయంత్రం సూర్యాపేట ఏరియా వైద్యశాలలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని వారు నివాసం ఉంటోన్న అద్దె ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇంటి యజమాని మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి నిరాకరించాడు. కరోనా లేదని వైద్య పత్రాలు చూపించినా ఒప్పుకోలేదు. ఫలితంగా గత్యంతరం లేక జోరువానలోనే శవాన్ని తమ సొంతూరైన దామరచర్లకి తీసుకెళ్లారు.
విషయాన్ని గ్రామంలోని కుల పెద్దలకు తెలపగా.. మృతదేహాన్ని గ్రామంలోకి తేవొద్దని.. ఊరు వెలుపలే ఖననం చేయాలని చెప్పడంతో చేసేది లేక ఊరి బయట అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి కరోనా లేదని చెప్పినప్పటికీ ఎవరూ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదని పలువురు వాపోయారు.
ఇదీచూడండి: 40 శాతం రోగులకు అందని కరోనా కిట్.. చేతులెత్తేసిన అధికారులు