సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. తన సొంత ఖర్చులతో సుమారు 1,200 కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనెలను పంపిణీ చేశారు. కరోనా విపత్కర సమయంలో దాతలు ముందుకొచ్చి నిరుపేదల కడుపు నింపాలని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల్లో కరోనా బారిన పడి అనాథలైన కుటుంబాలకు ఆయా ప్రభుత్వాలు 10 లక్షల ఆర్థిక సాయం చేస్తుంటే... తెలంగాణలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ మండిపడ్డారు.
రాష్ట్రంలో సెక్రటేరియట్ లాంటి చారిత్రాత్మక కట్టడాలను కూల్చడంలో చూపిన చొరవను కరోనా బాధితులపై చూపిస్తే బాగుంటుందని హితవు పలికారు. భువనగిరి, నల్లొండ పార్లమెంట్ పరిధిలో కరోనా బారిన పడి అనాథలైన కుటుంబాల వివరాలు సేకరించి కోమటిరెడ్డి ప్రతీక్ పౌండేషన్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతీ కుటుంబానికి 50 వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న, స్థానిక సర్పంచ్ కరుణ శ్రీ గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య