పురుగుల మందు చల్లిన గంటలోపే వరి పంట మొత్తం ఎండిపోయిందని ఓ యువరైతు వాపోయాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శంకర్నగర్కు చెందిన రాజశేఖర్.. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. పంట పొట్టకు వచ్చే సమయంలో ఎర్రబొమ్మిడి, మోగి తెగుళ్లు వస్తున్నాయని గ్రహించి బెజ్జంకిలోని గ్రోమోర్ సెంటర్లో సంప్రదించాడు. తెగుళ్ల నివారణకు కొన్ని క్రిమిసంహారక మందులు, ఎరువులు ఇచ్చారు. వారు చెప్పిన మోతాదులోనే ఎరువులను చల్లగా గంటసేపటిలోనే వరి పంట మొత్తం ఎండి పోయిందని రాజశేఖర్ వాపోయాడు.
ఈ విషయమై గ్రోమోర్ సెంటర్ను, మండల వ్యవసాయ అధికారులను సంప్రదించగా వాళ్లు పంటను పరిశీలించి వెళ్లారని తెలిపాడు. గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు మాత్రం ఏదైనా చేసుకోండని... తమకెలాంటి సంబంధం లేదంటున్నారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. లక్షల రూపాయల పెట్టుబడితో పంట సాగు చేస్తే ఎరువుల వల్ల నాశనం అయిందని... తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
పంట దెబ్బతిని 20 రోజులు గడిచినా అధికారులు, గ్రోమోర్ సెంటర్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నాడు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకొని పరిహారం అందేలా చూడాలని యువరైతు రాజశేఖర్ వేడుకుంటున్నాడు.
ఇదీ చదవండి: కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల అరెస్ట్