కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మొదటి పునరావాస గ్రామాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి జలాశయంలో ముంపునకు గురవుతున్న కొచ్చగుట్టపల్లికి సిద్దిపేట పట్టణ శివారులో పునరావాస కాలనీ నిర్మించారు. సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. రిబ్బన్ కత్తిరించి లబ్ధిదారులను ఇళ్లలోకి అడుగుపెట్టించారు.
దేశంలో మొదటి పునరావాస కాలనీ
నిర్వాసితులకు భూసేకరణ చట్టం- 2013 కంటే మెరుగైన పరిహారం ఇచ్చామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. చట్టం ప్రకారం 75 గజాల్లో ఇల్లు నిర్మిస్తే సరిపోతుందని.. కానీ.. తాము 250 గజాల విస్తీర్ణంలో రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తున్నామని ఆయన అన్నారు. కొత్త భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత దేశంలో ఏర్పాటు చేసిన మొదటి పునరావాస కాలనీ అని హరీష్ రావు అన్నారు. అన్నీ రకాల మౌలిక వసతులతో పునరావాస కాలనీ అంటే ఇలా ఉండాలి అనేలా వీటిని నిర్మించామన్నారు.
నిర్వాసితులపై ప్రత్యేక దృష్టి
ఆదాయ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. అనంతగిరి జలాశయంలో చేపలు పట్టుకునే హక్కులు శాశ్వతంగా కల్పిస్తామని.. సిద్దిపేట పారిశ్రామిక పార్కులో ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్లో ఎటువంటి ఇబ్బందులున్నా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
పునరావాస కాలనీపై నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, విద్యుత్, తాగు నీరు వంటి మౌలిక వసతులతో నిర్మించారని.. గేటెడ్ కమ్యూనిటిలా ఉందని.. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిర్వాసితుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించిందని.. వారికి అన్నీ విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి : బీమా చెక్కులు అందించిన కేటీఆర్