సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సన్నాలకు రూ.2,500 కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు.
తూకంలో కూడా క్వింటాలుకు 3 కిలోల ధాన్యాన్ని తరుగుగా తీసేస్తున్నారనీ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సన్నాలను వేశామని.. ఇప్పుడు దిగుబడి తగ్గి నష్టపోయామని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస మద్దతు ధరను చెల్లించి ఆదుకోవడం లేదంటూ ఆవేదన చెందారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై ధాన్యాన్ని పోసి తగులబెట్టారు. ప్రభుత్వం సన్న రకపు వరి ధాన్యాన్ని పండించిన రైతులకు కొంత బోనస్ చెల్లించే దిశగా ప్రయత్నాలు చేస్తోందని.. రైతులు అధైర్యపడవద్దని తహసీల్దార్ రైతులకు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి : 'మేనిఫెస్టోను అమలు చేసి ఇంటింటికి తిరిగి చెబుతాం'