దుబ్బాక ఉప ఎన్నికల ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై వందశాతం ఉంటుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. అక్కడి ఫలితమే జీహెచ్ఎంసీలో పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమే రాజ్యాంగంగా మారి తనపై అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడిన విజయం సాధించానని తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో రఘునందన్ రావు మాట్లాడారు.
భాజపాలోకి తెరాస అసంతృప్తులు
ఎన్నికల సమయంలో తమ నాయకులపై పెట్టిన కేసులను గెలుస్తామని చెప్పారు. తన కోసం పోరాటం చేసిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడితే ఆలస్యంగానైనా విజయం దక్కుతుందని తన విషయంలో నిరూపితమైందన్నారు. తెరాసలో సుమారు 30 నుంచి 40మంది నాయకులు అసంతృప్తులుగా ఉన్నారని వారందరిని భాజపాలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
జీవితాంతం భాజపాలోనే
గ్రేటర్లో వరద సాయం పూర్తిగా ఎన్నికల కోసం పంపిణీ చేసిన డబ్బులుగానే పరిగణిస్తున్నామని రఘునందన్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్పై కాషాయం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పదవులు ఉన్నా లేకున్నా ఒకేలా పనిచేస్తానని జీవితాంతం భాజపాలోనే కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీని ఉంచుతారో ముంచుతారో రెండు రోజుల్లో తెలుస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి : నాజల్ డ్రాప్ వ్యాక్సిన్పై కృషి చేస్తున్నాం: భారత్ బయోటెక్