మల్లన్నసాగర్ జలాశయం నుంచి భవిష్యతులో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, జనగాం నియోజకవర్గాలకు తాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇందుకుగాను నాబార్డు ద్వారా రూ.324 కోట్లు మంజూరు చేయించామన్నారు. సిద్దిపేట పురపాలిక 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశం జరిగింది. బడ్జెట్కు పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం సిద్దిపేట పురపాలికలో నీరు సరఫరా చేయడానికి వివిధ రూపాల్లో నెలకు రూ.కోటి ఖర్చు అవుతోందని మంత్రి అన్నారు. కరీంనగర్ జిల్లా దిగువమానేరు, గోదావరి సుజలస్రవంతి నుంచి నీటిని ట్యాపింగ్ చేయడం వల్ల భారీగా విద్యుత్తు బిల్లు వస్తోందని హరీశ్ రావు పేర్కొన్నారు. కుళాయి రుసుం రూపంలో నెలకు రూ.20 లక్షల ఆదాయం వస్తోందని.. ఈ అంతరంతో సాధారణ నిధులతో పనులు చేపట్టలేని స్థితి నెలకొందని వివరించారు.
"విద్యుత్తు బిల్లుల భారం తగ్గించడానికి మల్లన్నసాగర్ నుంచి సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, జనగాం నియోజకవర్గాలకు తాగునీరు సరఫరా చేస్తాం" - మంత్రి హరీశ్రావు
లాక్డౌన్ ప్రవేశపెట్టి 40 రోజులు ముగిశాక పైపులు వేయడానికి రహదారులను తవ్విపోస్తున్నారని, ప్రారంభం నుంచి చేపట్టాలని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో దశ కనెక్షన్ల అనుసంధానం జులై చివరిలోగా ప్రారంభించాలన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందు మొదటి దశ యూజీడీ కనెక్షన్ల అనుసంధానం పూర్తి కావాలన్నారు.
ఇదీ చూడండి: గ్రేటర్లో పెరుగుతున్న కేసులు.. భయాందోళనలో ప్రజలు