రక్షణ శాఖ ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక ఆయుధ భూషణ్ అవార్డు.. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అదనపు జనరల్ మేనేజర్ సుజాత గోగినేనికి దక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2019 సంవత్సరానికి ఈ అవార్డుకు సుజాతను ఎంపిక చేసినట్లు ఆర్టినెన్స్ ఫ్యాక్టరీల డీజీ గగన్ చతుర్వేది సోమవారం తెలిపారు.
సుజాత ప్రముఖ కార్మిక నాయకుడు గోగినేని సూర్యం, సుశీల దంపతుల కుమార్తె. ఆమె విద్యాభ్యాసం గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు, జేకేసీ కళాశాలలో సాగింది. బల్గేరియాలో ఇంజినీరింగ్ చదివారు. రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. మెదక్, చెన్నై, కోల్కతా తదితర ప్రాంతాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. పచ్చదనం-పరిశుభ్రత కోసం నిత్యం ఆమె తపిస్తారు. పనిచేసిన చోట సమీప గ్రామాల్లో మొక్కల పెంపకానికి ఆమె ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ నెల 18న కోల్కతాలో నిర్వహించే కార్యక్రమంలో సుజాత ఈ అవార్డును అందుకోనున్నారు.
- ఇదీ చదవండి : 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం