చిన్న పట్టణంలోనైనా ప్రతిరోజు కనీసం 20 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను సేకరించి, డంప్ యార్డ్కు తరలించడం పురపాలికలకు తలకు మించిన భారంగా మారుతోంది. ఇందులో 60 నుంచి 70శాతం వరకు కుళ్లి.. భూమిలో కలిసిపోయే కూరగాయలు, ఆకులు, ఆహార పదార్థాలు వంటి వ్యర్థాలే ఉంటున్నాయి.
తడి చెత్తతో ఎరువు
తడి చెత్త బయటికి రాకుండా.. ఇంట్లోనే పరిష్కారం చూపేలా సంగారెడ్డి పురపాలక సంఘం ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. హోమ్ కంపోస్టింగ్ పేరుతో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇంట్లో ఉత్పత్తయ్యే తడి చెత్తను ఎరువుగా మార్చుకునేలా ప్రోత్సహిస్తోంది. మొదటగా పట్టణంలోని రెస్టారెంట్లు, హోటళ్లు, మహిళా సంఘాలు, కాలనీల వారీగా ఔత్సాహికులను గుర్తించి వారికి.. నిపుణులతో శిక్షణ ఇస్తోంది.
చెత్త రహిత పట్టణంగా...
చెత్త రహిత పట్టణంగా సంగారెడ్డిని మార్చే లక్ష్యంతో పురపాలక సంఘం వివిధ విభాగాలకు చెందిన 20 మంది పట్టణ పారిశుద్ధ్య టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ అర్బన్ మెనేజ్ మెంట్ నిపుణుల సాయంతో పట్టణంలో చెత్త సేకరణ ప్రణాళిక తయారు చేశారు. వీరి ద్వారా చెత్తను పునర్వినియోగం చేసే కార్యక్రమాలు రూపొందించారు.
కంపోస్ట్ ఎరువుతో కిచెన్ గార్డెన్
ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ ఎరువుతో కిచెన్ గార్డెన్ పెంచుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా.. చెత్త పునర్వినియోగం కావడమే గాక.. తమకు అవసరమైన కూరగాయలను పండించుకోవచ్చు.
మీ చెత్తతోనే ఆరోగ్యం
హోమ్ కంపోస్టింగ్- కిచెన్ గార్డెనింగ్ ద్వారా రసాయనాలు లేని ఆరోగ్యకరమైన కూరగాయలు పొందవచ్చు. సొంతంగా పండించుకోవడం వల్ల.. కూరగాయలపై చేసే ఖర్చులనూ ఆదా చేసుకోవచ్చు.
- ఇదీ చూడండి : ప్రధానితో 'బంధం' గురించి జెన్నిఫర్ చెప్పిన కథ ఇది!