భారీగా వానలు కురిసి రైతులు పంట చేలలో స్వేదం చిందేలా పనిచేస్తూ... కనిపించే కాలమిది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా సంగారెడ్డి జిల్లాలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వరుణుడు ముఖం చాటేయడం వల్ల ప్రస్తుత సీజన్లో అన్నదాతలు మొదలు సామాన్యుల వరకు అంతా ఇబ్బందులు పడుతున్నారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎండాకాలాన్ని తలపించేలా భానుడు నిప్పులు చెరగుతున్నాడు. దీని వల్ల నేలలో ఉన్న కాస్త తడి కూడా ఆవిరైపోయి పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా అగచాట్లు పడుతున్నారు.
పత్తి పంటకు నష్టం
జిల్లాలో ప్రధానంగా పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఈసారి రెండు లక్షల పైచిలుకు ఎకరాల్లో విత్తనాలు వేశారు. సాధారణ వర్షపాతం నమోదైతే పత్తి మొక్కలు రెండు అడుగుల ఎత్తు పెరిగేవి. ప్రస్తుతం వర్షాలు లేక మొక్కల్లో పెరుగుదల కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 44.7 శాతం లోటు వర్షపాతం ఉంది. ఒకట్రెండు రోజులు మినహా చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా... ఇక్కడ కురవకపోవడంపై కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురిసిన కొద్దిపాటి వర్షం వల్ల కనీసం భూమి కూడా తడవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కల్హేర్లో మాత్రమే సాధారణం
జిల్లాలో 26 మండలాల్లో కేవలం కల్హేర్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. 22 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉండగా... మూడు మండలాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. కందిలో 77శాతం, గుమ్మడిదలలో 70, హత్నూరలో 64 శాతం లోటు వర్షపాతం ఉంది. సరైన వర్షాలు లేక చెరువుల్లోకి నీళ్లు రాలేదు. భూగర్భ జలాలు సైతం అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి.
జిల్లాలో భారీ వర్షాలు కురిస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదు. పంటలు కాపాడుకోవడానికి అన్నదాతలు... నీటి కష్టాలు పోవడానికి ప్రజలు వరుణిడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇదీ చూడండి : నిండుకుండలా జూరాల ప్రాజెక్టు