సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన గడి మొహల్లా ప్రాంతం పరిసరాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 15 నుంచి 25వ వార్డుల్లోని 31 ప్రధాన అంతర్గత దారులను మూసివేసి కంచెలను ఏర్పాటు చేశారు. కాలనీల్లో నుంచి బయటకు.. బయటి వ్యక్తులు లోపలికి రాకుండా ఏర్పాటు చేసిన కంచెల వద్ద మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా ఆర్డీవో రమేష్ బాబు ఆదేశాలు జారీ చేశారు.
అత్యవసరాలు, నిత్య అవసరాల కోసం కేటాయించిన నెంబర్లకు ఫోన్ చేస్తే సరుకులు ఇంటి వద్దకే పంపించే ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల ఎవరూ ద్విచక్రవాహనాలపై బయటికి రాకుండా రోడ్లపై అడ్డంగా గోతులు తీయించారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ కరోనా కట్టడిని మరింత పటిష్ఠంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.