ఇంటర్లో తప్పిన విద్యార్థులకు ఈ సారి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించరాదని ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన విద్యాశాఖ వారందరినీ కండోనేషన్ లేదా కంపార్ట్మెంటల్ పాస్ చేయాలా? అని తర్జనభర్జన పడుతోంది. ఇప్పటివరకు తప్పినవారికి ఎఫ్ అని ధ్రువపత్రాలపై రాస్తున్నారు. ఈసారి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకపోతుండటం వల్ల కంపార్ట్మెంటల్ పాస్ అని ఇవ్వాలని యోచన. అంటే విద్యార్థికి ఎన్ని మార్కులొచ్చిన 35 మార్కులిచ్చి ఉత్తీర్ణుల్ని చేస్తారు.
ఇంకా కండోనేషన్ పాస్(సీపీ) అని ఇవ్వాలన్నది మరో ఆలోచన. సర్టిఫికెట్పై విద్యార్థికి వచ్చిన మార్కులే ఉంటాయి. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో వారు పాసైనట్లు లెక్క. అలా చేస్తే ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలు పొందాలనుకుంటే సమస్యలు వస్తాయని ఇంటర్బోర్డు అధికారులు భావిస్తున్నారు. అన్ని రాష్ట్ర బోర్డులు సభ్యులుగా ఉండే కౌన్సిల్ ఆఫ్ బోర్డ్సు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(కాబ్సే) అధికారులతోనూ మాట్లాడుతున్నట్లు తెలిసింది.