కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారిచింది. మౌలిక వసతులతో పాటు.. కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రవేశ పెట్టడం వల్ల డెలివరీల సంఖ్య ముమ్మరంగా పెరిగింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబులను ఆశ్రయిస్తున్న వారు దోపిడీకి గురవ్వకుండా స్వయంగా ప్రభుత్వమే తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబులను ఏర్పాటు చేస్తోంది. మొదటగా పైలెట్ ప్రాజెక్టుగా సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి అవసరమైన పరికరాలు ఇప్పటికే చేరుకున్నాయని అధికారులు తెలిపారు.
డ్రై రన్
ఈ పథకంలో భాగంగా మౌలిక వసతుల కల్పన, పరికరాల కోనుగోలుకు ఒక్కో జిల్లాకు రెండున్నర కోట్ల రూపాయలు కేటాయించారు. వీటితో బయో కెమిస్ట్రీ, పాథాలజీ ల్యాబులు బ్లెడ్ రేజర్స్ వంటి పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ డయాగ్నోస్టిక్ హబ్బుల్లో సాధారణ పరీక్షల నుంచి థైరాయిడ్, లివర్, కొలెస్ట్రాల్, గుండె, మూత్రపిండాలు, బ్రెయిన్, నాడీ కణజాలాలు, వెన్నుపూసలకు సంబంధించిన 25 రకాల కీలక పరీక్షలు.. వీటిని అనుసంధానంగా మొత్తం పరీక్షలు చేయనున్నారు. ఇవన్నీ ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. ప్రస్తుతం డ్రైరన్ నిర్వహిస్తున్నారు.
నమూనా సేకరణపై శిక్షణ
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే డయాగ్నోస్టిక్ హబ్కు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో నమూనాలు సేకరించి హబ్కు తరలించి.. నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. జిల్లా పరిధిలోని 16 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు 4 అర్బన్ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి.. రోగుల నుంచి నమూనాల సేకరణ, వాటిని భద్రపరిచి డయాగ్నోస్టిక్ హబ్కు పంపించే విధానంపై శిక్షణ ఇచ్చారు. దీనికి కావాల్సిన పరికరాలు ఆసుపత్రులకు అందజేసినట్లు కరీంనగర్ డీఎంహెచ్ఓ తెలిపారు.
24 గంటలు అందుబాటులో..
నమూనాల సంఖ్యను బట్టి 24 గంటలు సేవలందించడానికి రోగనిర్దారణ కేంద్రాలు సిద్దం అవుతున్నాయి. త్వరలో ఈ సేవలకు అదనంగా మరిన్ని పరీక్షలు అందుబాటులోకి తీసుకురానున్నారు.
- ఇదీ చూడండి : కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు