ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో తెలిసినవారు మరణిస్తే సైతం వారి వద్దకు వెళ్లలేని స్థితిలో ఉన్నామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న వైద్యులు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను ఎంత అభినందించిన తక్కువేనని మంత్రి అన్నారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలోని జూనియర్ కళాశాల మైదానంలో పుట్ట లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "మీ సేవకు మా సత్కారం" కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొవిడ్- 19 వైరస్ నియంత్రణలో అందరికంటే ముందు ఉండి పోరాడుతున్న వారికి సాంప్రదాయ దుస్తులు పంపిణీ చేసి సన్మానించారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా ఆశా వర్కర్లు , వైద్య సిబ్బంది ప్రతిరోజూ గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని, గృహనిర్బంధం చేసిన వారిని ప్రతిరోజు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.
అంతకముందు పుట్ట లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పెద్దపెల్లి జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.