నిజామాబాద్ నగరంలో కొనసాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పరిశీలించడానికి మేయర్ దండు నీతూ కిరణ్ నగరంలో పర్యటించారు. మున్సిపాలిటీలోని 8, 11, 38వ డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనుల ద్వారా నగరంలో మురికికాలువలు శుభ్రం చేయటం, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేయడం, మురికి కాలువలు లేని చోట తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ఖాళీ స్థలాల్లో ఆయిల్ బాల్స్, దోమల నివారణ మందులు వేయాలని సిబ్బందికి మేయర్ సూచించారు.
పలు కాలనీల్లో పర్యటించిన మేయర్ కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలు చెత్తను రోడ్లపై, మురికి కాలువలలో వేయకుండా మున్సిపల్ వాహనాల్లో వేయాలని సూచించారు. నిజామాబాద్ను చెత్త రహిత నగరంగా మార్చడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలిపారు.
ఇవీచూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు