ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గత యాసంగిలో ఈ సమయానికి ఎంతైతే ధాన్యం కొనుగోలు చేశామో, ఈ కరోనా కష్ట సమయంలో కూడా అదే వేగంతో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించామని మంత్రి చెప్పారు. రోజుకు 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, 20 రోజుల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు మిగిలిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సమీక్షించారు. జిల్లాలో మొత్తం 339 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 2.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు.
రైతులు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని తీసుకువచ్చినప్పటికీ రైస్మిల్లర్లు కడ్తా తీయడం క్షమించరాని నేరమని, అలా జరిగితే మిల్లులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ధాన్యాన్ని 16 గంటలలోగా రైస్మిల్లర్లు అన్లోడ్ చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దని సూచించారు. ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇప్పటికే రూ.142 కోట్లను మద్దతు ధర కింద రైతులకు చెల్లించిందని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, షఖీల్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష