వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ ప్రాంతంలో నీటి వసతిని సమకూర్చామని అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తాగునీటి కోసం వన్యప్రాణులు జనారణ్యంలోకి రాకుండా అటవీ శాఖ పటిష్ఠమైన చర్యలు చేపట్టిందన్నారు. ఇటీవల కాలంలో జనావాసాల్లోకి తరచూ చిరుత పులులు, ఇతర జంతువులు వస్తోన్న తరుణంలో అటవీ శాఖ మంత్రి స్పందించారు. ఎండకాలంలో వన్యప్రాణులు తమ ఆవాసాలను వదిలి నీటిని, ఆహారాన్ని వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తుంటాయని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల మానవ సంచారం, వాహనాల శబ్దాలు కూడా లేకపోవడం వల్ల పక్షులు, వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయని వివరించారు.
కదిలికల కోసం నిఘా నేత్రం..
ఈ క్రమంలో సమస్యను నివారించేందుకు అడవుల్లో తాగునీటి సౌకర్యం కోసం అటవీ అధికారులు చర్యలు చేపట్టారన్నారు. సోలార్ పంప్ సెట్లతో పాటు సాసర్ పిట్లు నిర్మించి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపడం చేస్తున్నామని తెలిపారు. శాఖాహార జంతువుల కోసం గడ్డి క్షేత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వన్యప్రాణుల కదలికలు పసిగట్టేందుకు అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలోకి మిడతలు రాకుండా ప్రత్యేక కమిటీ: సీఎం కేసీఆర్